
డేటా చోరీ కేసులో సైబరాబాద్ పోలీసులు దూకుడు పెంచారు. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం లీకేజీపై ప్రముఖ సంస్థలకు నోటీసులు జారీచేశారు. డేటా చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు. కోట్లాది మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి నడిబజార్లో అమ్మకానికిపెట్టేస్తోన్న సైబర్క్రిమినల్స్ ఆటకట్టించేపనిలో పడ్డారు. అందులో భాగంగానే ముందుగా డేటా లీకేజీ అయిన కంపెనీలపై దృష్టిసారించారు. మొత్తం 11 ప్రముఖ సంస్థలకు నోటీసులు జారీచేశారు సైబరాబాద్ పోలీసులు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, ఐటీ కంపెనీలు, ఓటీటీ, ఈ కామర్స్ వెబ్సైట్లు, ఈ లెర్నింగ్ సెంటర్లుకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు పంపారు. బిగ్ బాస్కెట్, ఫోన్పే, ఫేస్బుక్, పాలసీబజార్, మ్యాట్రిక్స్, SBI, బ్యాంక్ ఆఫ్ బరోడాల నుంచి డేటా చోరీకి గురవడంతో ఆయా కంపెనీలకు నోటీసులు జారీచేశారు. యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, టెక్ మహీంద్రాతో పాటు పలు కంపెనీల నుంచి డేటా చోరీకి గురవడంతో ఆయా కంపెనీలకు నోటీసులు పంపించారు సైబరాబాద్ పోలీసులు. వినియోగదారుల డేటా లీకేజీకి సంబంధించి ఆ కంపెనీల నుంచి వివరణ కోరారు.
మరోవైపు డేటా చోరీ కేసు బయటపడటంతో సైబరాబాద్ పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రణాళికలు రూపొందించారు. పలు కంపెనీలకు 20అంశాలతో కూడిన లేఖలు రాయాలని నిర్ణయించారు. డేటా బయటకు వెళ్లకుండా వ్యక్తిగతంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించే విధంగా కొన్ని అంశాలను రూపొందించారు సైబర్ క్రైం పోలీసులు. ఇన్ఫర్మేషన్ యాక్టులో నిబంధనలు అమలయ్యేలా సైబరాబాద్ పోలీసులు దృష్టి సారించారు. వినియోగదారులు తమ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు ఇతర విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.