
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అక్రమార్కుల పాలిట సింహస్వప్నంలా మారింది. ఇతర దేశాలు, ప్రాంతాల నుంచి ఇల్లీగల్ గా తరలిస్తున్న నగదు, బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా ఫారెన్ కరెన్సీ, బంగారం పట్టుబడింది. షార్జా నుంచి శంషాబాద్ వచ్చిన వక్తి వద్ద నుంచి కస్టమ్స్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ లో అక్రమార్కులకు కస్టమ్స్ అధికారులు వరుసగా చెక్ పెడుతున్నారు. ఈనెల 9వ తారీఖున దుబాయ్, కువైట్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 4.5 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఇదే క్రమంలో మరోసారి భారీగా ఫారెన్ కరెన్సీని పట్టుకున్నారు. షార్జా నుంచి 6ఈ-1405 విమానంలో వచ్చిన వ్యక్తి నుంచి లక్ష సౌదీ రియాల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇండియా కరెన్సీ విలువలో రూ.21.70లక్షలు ఉంటాయని అధికారులు చెప్పారు. సీఎస్ఎఫ్ఐ స్టాప్ సహాయంతో ఇంటర్ నేషనల్ టెర్మినల్ దగ్గర ఫారెన్ కరెన్సీ తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
మరోవైపు ఇదే ఎయిర్ పోర్ట్ లో అక్రమ బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు. జే9-403 విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఫారెన్ వ్యక్తి నుంచి 500 గ్రాముల 24 క్యారెట్ల బంగారు గొలుసు, 302 గ్రాముల ఆరు బంగారు గాజులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. పట్టుబడిన మొత్తం 802 గ్రాముల బంగారం విలువ రూ.41.86 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. వీరిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెప్పారు.