
కోవిడ్ 19 మార్గదర్శకాల ప్రకారమే ఈ ఏడాది గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. గురువారం బేగంబజార్లోని బహేతిభవన్లో కమిటీ అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి భగవంతరావ్, ఉపాధ్యక్షుడు రామరాజుల నేతృత్వంలో ఉత్సవ సమితి సమావేశమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కరోనా మార్గదర్శకాల ప్రకారం ప్రతి గణేష్ మండల్లో భక్తులు మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్లు ఉపయోగించాలని నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇక ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా ప్రభుత్వం భక్తులకు తగిన ఏర్పాట్లు చేసి సహకరించాలని ఈ సందర్భంగా సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కాగా ఆగష్టు 22 నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో గణేష్ ఉత్సవాలపై పలు రాష్ట్రాలు కొన్ని నిబంధనలను విధిస్తోన్న విషయం తెలిసిందే.