
Deadly Bacteria in Hyderabad Lakes : హైదరాబాద్ ప్రజలు అప్రమత్తం కండి.. ఆపదలో చిక్కకోకముందే తేరుకోండి.. అంటు వ్యాధులకు గురికాకముందే జాగ్రత్త పడండి.. ఒక్కసారి మీరు తాగే నీళ్లు మంచివో కాదో తెలుసుకోండి లేదంటే ప్రాణాలకు ముప్పు.. ఎందుకంటే హైదరాబాద్ పరిసర ప్రాంత సరస్సులలో కొత్త రకం బ్యాక్టీరియా పెరుగుతుందని ఐఐటి-హైదరాబాద్ పరిశోధకులు చెబుతున్నారు.
హైదరాబాద్ సరస్సులలో భారీ లోహాలు, మురికి నీరు, ఇతర కాలుష్య కారకాలతో పాటు ఘోరమైన బ్యాక్టీరియా కూడా పెరుగుతోంది. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ బ్యాక్టిరియాలో కార్డపెనెంస్ అని పిలువబడే NDM-1 (న్యూ ఢిల్లీ మెటల్లో-బీటా-లాక్టమాస్ -1) జన్యువును కలిగి ఉంది. ఐఐటి-హైదరాబాద్లోని సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ తతికొండ శశిధర్, పరిశోధనా పండితుడు రాజీవ్ రంజన్తో కలిసి హైదరాబాద్ పరిసరాల్లోని నీటి వనరుల నుంచి నీటి నమూనాలను సేకరించి, ఎన్డిఎం -1 జన్యువు కలిగిన బ్యాక్టీరియా ఉనికిని పరీక్షించారు.
మంజీరా ఆనకట్ట, సింగూర్ ఆనకట్ట, మంజీరా నీటి శుద్ధి కర్మాగారం, అంబర్పేట్ మురుగునీటి శుద్ధి కర్మాగారం (ఎస్టిపి) మరియు 13 సరస్సులు – దుర్గాం చెరువు, అమీన్పూర్, ఉస్మాన్ సాగర్, అల్వాల్, హుస్సేన్సాగర్, మోమిన్పేట్, సరూర్నగర్, ఫాక్స్ సాగర్, హిమాయత్సాగర్, కంది, మీర్ ఆలం, నాగోల్ మరియు సఫిల్గుడ వద్ద ఈ బ్యాక్టీరియా ఆనవాళ్లను గుర్తించారు.NDM-1 జన్యువుతో ఉన్న బ్యాక్టీరియా మానవులలో అంటువ్యాధులకు కారణమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.