Hyderabad: మరీ ఇంత దారుణమా?.. ఇంటర్ బాలికపై 8 మంది అత్యాచారం.. రెండ్రోజుల్లో..
హైదరాబాద్లో దారుణ ఘటన వెలుగు చూసింది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరధిలో ఓ బాలికపై సుమారు 8 మంది యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.. ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇంటర్ చదువుతున్న ఓ 16 ఏళ్ల బాలికపై దాదాపు 8 మంది అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చబొల్లారం ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక స్థానికంగా ఉన్న ఓ కాలేజ్లో ఇంటర్ చదువుతోంది.. అయితే ఆమెకు స్కూల్ టైంలో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ చనువుతోనే కొన్ని నెలల తర్వాత వరుణ్ ఆమెకు మత్తు మందు కలిపిన కొన్ని చాక్లెట్లు ఇచ్చాడు.. అవి తిన్న బాలిక స్రృహ కోల్పోవడంతో ఆమెను తన కార్లో తీసుకెళ్లిన యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఇదిలా ఉండగా ఆ యువకుడి ద్వారా బాలికకు పరిచయమైన అతని స్నేహితుడు కూడా బాధితురాలికి మందు, సిగరెట్లు, గంజాయి అలవాటు చేసి.. ఆ తర్వాత కొంపల్లిలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి ముందే ఇన్స్టాలో బాలికకు పరిచయమైన మరో యువకుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు పోలీసులు తెలిపారు.. అయితే బాలిక ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమెను మందలించారు తల్లిదండ్రులు.. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఈ నెల 9న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది.
బాలిక ఇంటి నుంచి బొల్లారం రైల్వేస్టేషన్కు వెళ్లగా.. అక్కడ ఆమెకు మరో యువకుడితో పరిచయం ఏర్పడింది.. దీంతో అతను తన స్నేహితుడి సహాయంతో బాలికను ట్రాప్లోకి దించాడు.. ఆ తర్వాత ఆమెకు మత్తు పదార్థాలు ఇచ్చి ఇద్దరూ వేర్వేరుగా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను మరో ప్రాంతానికి తీసుకెళ్లి.. అక్కడ మరో ఇద్దరితో కలిసి మళ్లీ లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం రైల్వే స్టేషన్లో తొలుత పరిచయమైన యువకుడు బాలికను బొల్లారంలోని తన ఇంటికి తీసుకొచ్చి బంధించాడు.
అయితే ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్న బాలిక బొల్లారం రైల్వే స్టేషన్కు చేరుకోగా.. మళ్లీ అక్కడికి వచ్చిన ఆ యువకుడు, అతని మరో స్నేహితుడి సహాయంతో బాధితురాలిని అక్కడి నుంచి మేడ్చల్ రైల్వే స్టేషన్కు లాక్కెళ్లారు.. అక్కడ మళ్లీ బాలికపై ట్రైన్లో మరోసారి అత్యాచారం చేసి మల్కాజ్గిరివైపు వెళ్లారు.. ఈ క్రమంలో నిందితుల నుంచి తప్పించుకున్న బాలిక ఈ నెల 10న ఇంటికి చేరుకొని జరిగిన విషయాన్ని పేరెంట్స్కు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు.
బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ఘటనతో సంబంధం ఉన్న మొత్తం 8 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
