
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ సూపర్ న్యూస్ అందించింది. మెట్రో స్టేషన్ల దగ్గర మినీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. మెట్రో దిగగానే వీటి ద్వారా ప్రజలు సులువుగా తమ గమ్య స్థానానికి చేరుకోవచ్చు. ప్రస్తుతం మెట్రో స్టేషన్ల వద్ద బస్టాఫ్లు ఉండటం లేదు. బస్టాఫ్లు చాలా దూరంలో ఉండటంతో ప్రయాణికులు చాలాదూరం నడవాల్సి ఉంటుంది. దీని వల్ల గమ్యస్థానానికి చేరుకునేందుకు ఆలస్యం జరుగుతోంది. ఇక వృద్దులు, మహిళలు కిలోమీటర్ల మేర నడవలేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది మెట్రో దిగాక తమ ఇంటికి చేరుకునేందుకు ఆటోలు, క్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ సమస్యలను గుర్తించిన ఆర్టీసీ అధికారులు.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు మెట్రో స్టేషన్ల దగ్గర మినీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఫీడర్ సర్వీసులుగా మినీ ఎలక్ట్రిక్ బస్సులను తిప్పాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. మెట్రో స్టేషన్ల నుంచి సమీపంలోని కాలనీలకు ఈ బస్సులు సర్వీసులు అందించనున్నాయి. ఇప్పటికే నగరవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు పెద్ద సంఖ్యలో నగరవాసులకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటి రాకతో మెట్రో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం రానుంది. అయితే ఎలక్ట్రిక్ బస్సులకు చార్జింగ్ చేసేందుకు నగరవ్యాప్తంగా ఇంటర్మిటెంట్ ఛార్జింగ్ స్టేషన్లను ఆర్టీసీ ఏర్పాటు చేయనుంది. ఎల్బీనగర్, చిలకలగూడ, బాలానగర్, కేపీహెచ్బీ కాలనీ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, పటాన్ చెర్వు, ఆరాంఘల్, ఉప్పల్, వనస్థలిపురం, గచ్చిబౌలి, మెహిదీపట్నం, గండిమైసమ్మ వంటి ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్లు అవసరమని అర్టీసీ అధికారులు గుర్తించారు. త్వరలో ఈ ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకుకు ఆర్టీసీ అధికారులు సిద్దమవుతున్నారు.
చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం 1500 నుంచి 2500 చదరపు మీటర్ల భూమి అవసరం అవుతుందని ఆర్టీసీ అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఈ భూమిని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. భూములను గుర్తించిన అనంతరం జాబితా అందించాలని రెవెన్యూ అధికారులను ఆర్టీసీ కోరింది. ఈ ఇంటిర్మిటెంట్ ఛార్జింగ్ స్టేషన్లు 10 నిమిషాల్లోనే బ్యాటరీని పాక్షికంగా చార్జింగ్ చేస్తాయి. 300 నుంచి 600 కిలోవాట్ సామర్థ్యంతో కూడిన హై పవర్ ఛార్జర్లు బస్సులను త్వరగా ఛార్జ్ చేస్తాయి. త్వరగా ఛార్జింగ్ ఎక్కడం వల్ల బస్సులను ఎక్కువ ట్రిప్పులు తిప్పవచ్చు. అలాగే బస్సులకు మధ్య మధ్యలో ఛార్జింగ్ పెట్టడం వల్ల డిపోకు తిరిగి వచ్చిన తర్వాత పూర్తిగా ఛార్జింగ్ పెట్టే పని ఉండదు. దీని వల్ల పవర్ గ్రిడ్పై భారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.