Telangana: ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండిః భట్టి విక్రమార్క

|

Sep 01, 2024 | 3:29 PM

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలోరాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి నది తీరం వెంబడి అధికారులు 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Telangana: ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండిః భట్టి విక్రమార్క
Deputy Cm Bhatti Vkramarka
Follow us on

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలోరాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి నది తీరం వెంబడి అధికారులు 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు గురించి ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర సచివాలయం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు.

మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ముంపు గ్రామాల్లో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. అలాగే ముంపు ప్రాంత జిల్లాలను గుర్తించి విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. చెరువుల ఆక్రమణలు తొలగించే పనిలో నిమగ్నమైన హైడ్రా ప్రస్తుతం తొలగింపులను రెండు మూడు రోజుల పాటు విరామం ప్రకటించి, ఈ విపత్తును ఎదుర్కొనేందుకు రెస్క్యూ ఆపరేషన్ టీమ్ లను ఏర్పాటు చేసుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లో ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యల గురించి హైడ్రా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని పేర్కొన్నారు.

వరద ముప్పు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్లను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను  సురక్షిత ప్రాంతాలకు తరలించి, అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకు తరలించి తగిన భోజన వసతి, వైద్య సదుపాయం ఏర్పాటు చేయాలని చెప్పారు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలను చేపట్టాలని అత్యవసర సేవలకు కావాల్సిన నిధులను ఆర్థిక శాఖ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని ఉదయం మధిర తహశీల్దార్ కార్యాలయం నుంచి ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్న విద్యుత్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు వెల్లడించారు. అలాగే, విద్యుత్తు, మంచినీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. వరద నీరు ఉదృతంగా ప్రవహించే రోడ్ల పైన వాహనాలను అనుమతించొద్దని పోలీస్ శాఖను ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..