
నైరుతి రుతుపవనాలు జూలై 02న గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాలు, ఉత్తరప్రదేశ్లోని మిగిలిన ప్రాంతాలు, ఢిల్లీ అంతటా, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్లలోని చాలా ప్రాంతాలు, అలాగే రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు విస్తరించాయి.జూలై 2 నాటికి రుతుపవనాల ఉత్తర పరిమితి 22°N/60°E, 22°N/65°E, పోర్బందర్, వల్లభ్ విద్యానగర్, నీముచ్, టోంక్, భివానీ, భటిండా, 32.5°N/70°Eల గుండా వెళుతోంది. రాబోయే 2-3 రోజులలో ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్లలోని మిగిలిన ప్రాంతాలు, అలాగే రాజస్థాన్లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. దీని ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల వరకు వాతావరణం ఎలా ఉంటుందనే విషయంపై కీలక సూచనలు జారీ చేసింది.
జులై 2వ తేదీన రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇక జులై 3, 4వ తేదీల్లో కూడా రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు స్పష్టం చేశారు. పలు చోట్ల పిడుగులు కూడా పడే అవకాశముందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నైరుతి రుతుపవనాల్లో కదలిక కనిపించడం, వేగంగా విస్తరించనుండటంతో రానున్న రోజుల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెబుతున్నారు.