
వరంగల్, మార్చి 31: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం టూక్యానగర్ ప్రాథమిక పాఠశాలకు ఏకోపాధ్యాయుడు చంద్రశేఖర్ (46). ఎప్పటి మాదిరిగానే చంద్రశేఖర్ సోమవారం విధులకు హాజరయ్యాడు. తరగతి గదిలో పిల్లలకు పాఠం బోధిస్తున్న క్రమంలో ఛాతి నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు కొద్దిసేపు సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో వెంటనే నెక్కొండలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా మృతుడు చంద్రశేఖర్ స్వస్థలం సంగెం మండలం కాట్రపల్లి గ్రామం. ఆయనకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. గతంలో గోరు గుట్ట తండా స్కూల్ హెడ్మాస్టర్గా చంద్రశేఖర్ పనిచేశాడు. కరోనా తర్వాత ఈ సడన్ హార్ట్ అటాక్స్ పెరిగిపోయాయి. తాజా ఘటనతో చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగారు.
కాగా గుండెపోటు వచ్చే ముందు వచ్చే తొలి సంకేతం ఛాతీ నొప్పి. ఛాతీపై ఒత్తిడి, బిగుతుగా అనిపించడం, బరువుగా ఉండటం, చేతి ఎడమవైపు జాలుగా అనిపించడం దీని లక్షణాలు. ఛాతీలో ఏదైనా అసౌకర్యంగా అనిపించి కొన్ని నిమిషాలపాటు కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా ఈ నొప్పి భుజాలు, చేతులు నుంచి దవడ వరకు పాకినట్లయితే ఆందోళన కలిగించే సంకేతంగా భావించాలి. ఇలా సైలెంట్గా వచ్చే హార్ట్ ఎటాక్ను దాని లక్షణాల ఆధారంగా మాత్రమే గుర్తించి అప్రమత్తమైతే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.
వేసవిలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అధికవేడికి ఉన్నట్లు ఛాతిలో నొప్పి రావడం, కుప్పకూలిపోవడం వంటివి జరుగుతుంటాయి. కాబట్టి 40 ఏళ్లకు పైబడిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సాధారణ గుండె నొప్పి మాదిరి మెడ, చేతి, అరచేతి నొప్పి రావడం, మగతగా ఉండడం, చెమటలు పట్టడం లాంటి లక్షణాలు సైలెంట్ హార్ట్ ఎటాక్లో కనిపించవు. దీంతో చాలా మంది దీనిని పెద్దగా పట్టించుకోరు. ఇలాంటివి తరచూ వచ్చే అసౌకర్యంగా అపోహపడకుండా తక్షణ వైద్య సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.