Telangana: తెలంగాణలో ముందుమాట వివాదం.. ఆ ఇద్దరు అధికారులపై వేటు

|

Jun 14, 2024 | 9:28 PM

పుస్తకాలను మళ్లీ ముద్రిస్తున్నామనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. దీని వల్ల ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడదన్నారు. ఇప్పటికైనా విపక్షాల ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. తప్పు జరిగినప్పుడు చర్యలు చేపట్టడం తప్పేంకాదన్నారు రామ్మోహన్ రెడ్డి.

Telangana: తెలంగాణలో ముందుమాట వివాదం.. ఆ ఇద్దరు అధికారులపై వేటు
Errors Text Books
Follow us on

తెలుగు పాఠ్యపుస్తకాలలో ముందుమాటలో చోటు చేసుకున్న తప్పులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం… అధికారులపై చర్యలకు ఆదేశించింది. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాసచారి, ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డిపై చర్యలకు ఆదేశించింది. పాఠ్యపుస్తకాల బాధ్యతల నుంచి వీరిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్సీఈఆర్టీ డైరెక్టర్‌గా… పాఠశాల విద్య అదనపు డైరెక్టర్ రమేశ్‌ను, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల విభాగం డైరెక్టర్‌గా… టీఆర్ఈఐఎస్ కార్యదర్శి రమణ కుమార్‌కు బాధ్యతలను అప్పగించారు.

ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న పాఠ్య పుస్తకాల్లో ముందుమాటలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు, అధికారుల పేర్లను ముద్రించారు. దీంతో 24 లక్షల పుస్తకాలను వెనక్కి తీసుకున్నారు. తొలుత ఆ పేజీలను చించేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ దాని వెనుక వందేమాతరం, జాతీయగీతం, ప్రతిజ్ఞ ఉండటంతో… స్టిక్కర్ వేయాలని నిర్ణయానికి వచ్చారు.

పాఠ్యపుస్తకాల్లో కేవలం ముందుమాట పేజీ మార్చి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తున్నామన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. విద్యార్థులకు తప్పుడు సమాచారం వెళ్లకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దీనిపై విపక్షాల విమర్శలు అర్థరహితమని అన్నారు. పుస్తకాలను మళ్లీ ముద్రిస్తున్నామనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. దీని వల్ల ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం పడదన్నారు. ఇప్పటికైనా విపక్షాల ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. తప్పు జరిగినప్పుడు చర్యలు చేపట్టడం తప్పేంకాదన్నారు రామ్మోహన్ రెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..