
తెలంగాణలో కలకలం రేపిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్యకేసు మొత్తాన్ని డీకోడ్ చేశారు..గద్వాల పోలీసులు. నిందితులు ఈ హత్యకు మేఘాలయ హనీమూన్ మర్డర్నే స్పూర్తిగా తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు..హత్యకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.
గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. కేసులో బ్యాంక్ మేనేజర్ తిరుమల రావును ఏ1 గా, తేజేశ్వర్ భార్య ఐశ్వర్యను ఏ2గా, అత్త సుజాతను A8గా చేర్చారు పోలీసులు. ఎంగేజ్మెంట్ నుంచే తేజేశ్వర్ హత్యకు ప్రణాళికను రూపొందించారు నిందితులు. అందుకోసం మేఘాలయ హనీమూన్ మర్డర్ను స్పూర్తిగా తీసుకున్నారు. అయితే అక్కడిలా పొరపాటు చేయొద్దని పక్కాగా ప్లాన్ చేసుకున్నట్టు వివరించారు ఎస్పీ. తేజేశ్వర్ను బైక్పై కర్నూలుకు తీసుకొచ్చి చంపాలనుకున్నారని అయితే బైక్పై వర్కవుట్ కాకపోవడంతో కారును ఉపయోగించారని చెప్పారు. తేజేశ్వర్ కదలికలను తెలుసుకోవడానికి నిందితులు జీపీఎస్ ట్రాకర్ వాడారు. తేజేశ్వర్ హత్య తర్వాత లడఖ్గానీ, అండమాన్ గానీ వెళ్లిపోవాలని నిందితులు ప్లాన్ చేసుకున్నట్టు ఎస్పీ శ్రీనివాసరావు వివరించారు.
బ్యాంకు లోన్లు ఇప్పించే నగేష్తో ఈ హత్యకు ప్రణాళిక రచించాడు తిరుమలరావు. ఈ హత్య చేస్తే లైఫ్టైమ్ సెటిల్మెంట్ ఉంటుందని అతడికి తిరుమలరావు హామీ ఇచ్చాడు. ఈ హత్యకు సహకరించిన తిరుమలరావు తండ్రిని కూడా అరెస్ట్ చేసినట్టు చెప్పారు గద్వాల ఎస్పీ.
ఎస్పీ కేసు గురించి చెప్పిన వివరాలు దిగువన వీడియోలో చూడండి…
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.