రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆ దేశాల పౌరులు, సైనికులను మాత్రమే కాదు.. అమాయక యువత ప్రాణాలు తీస్తోంది. ఉద్యోగం పేరుతో కొందరు ఏజెంట్లు అమాయక యువకులను యుద్ధంలో దింపి ప్రాణాలకు కారణమవుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో యువకులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఓ హైదరాబాద్ యువకుడు చనిపోవడం కలిచివేస్తోంది. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం బుధవారం ఒక పోస్ట్ లో హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ అస్ఫాన్ మరణాన్ని ధృవీకరించింది. కానీ దానికి గల కారణాలను వెల్లడించలేదు. ఇక అతను దేశంలో ఏమి చేస్తున్నాడో క్లారిటీ ఇవ్వలేదు.
‘మహమ్మద్ అస్ఫాన్ అనే భారతీయుడు దుర్మరణం చెందాడని తెలుసుకున్నాం. కుటుంబ సభ్యులు, రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఆయన పార్థివదేహాన్ని భారత్ కు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తుంది’ అని రాయబార కార్యాలయం పోస్ట్ లో పేర్కొంది.
అధిక వేతనంతో కూడిన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రష్యాకు తీసుకెళ్లిన దాదాపు రెండు డజన్ల మంది భారతీయుల్లో ఒకడు. అయితే అఫ్సాన్ మరణవార్తను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తమకు తెలియజేశారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గత నెలలో ఈ అంశాన్ని హైలైట్ చేసిన వారిలో ఒవైసీ ఒకరు. తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, జమ్ముకశ్మీర్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు చెందిన పురుషులు ఈ విధంగా మోసపోయి యుద్ధంలో పాల్గొనాల్సి వస్తోందని ఫిబ్రవరి 21న విదేశాంగ మంత్రి కి లేఖ రాశానని ఎంఐఎం నేత తెలిపారు.
రష్యాలో చిక్కుకున్న కనీసం 20 మంది భారతీయులు భారత అధికారులను సంప్రదించారని, వారిని స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 29 న తెలిపింది. రష్యాలో చిక్కుకున్న వారిలో చాలా మందిని దుబాయ్ కు చెందిన ఫైజల్ ఖాన్ అనే ఏజెంట్ మోసం చేసినట్లు తెలుస్తోంది.