
మహబూబాబాద్ జిల్లాలోని ఓ తండావాసులు చేపల చెరువును లూటీ చేశారు. తండా వాసులంతా ఒక్కసారిగా చేపల చెరువుపై పడి అందులోని చేపలన్నీ ఎత్తుకెళ్లారు. చేపల కోసం తండావాసులంతా తండోపతండలుగా తరలి రావడంతో ఆ చేరువంతా చిన్నప్పటి జాతరను తలపించింది. మహిళలు, పిల్లలు, వృద్ధులు కూడా చేపలు పట్టి సంచుల్లో నింపుకెళ్లారు. వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం గోపాతండా శివారులో ఈ ఘటన వెలుగు చూసింది.. తండావాసులంతా బంధంకుంట చెరువు పై దండయాత్ర ప్రకటించారు. వలలు, చీరలు, లుంగీలు ఎవరికి ఏది దొరికితే వాటితో చేపలు పట్టుకొని పండుగ చేసుకున్నారు.
తండాలోని ఆడ- మగ, చిన్న -పెద్ద తేడా లేకుండా వృద్ధులు సైతం బంధంకుంట చెరువు వద్దకు వచ్చి చేపల వేటలో నిమగ్మయ్యారు.. పోటా పోటీగా చేపలు పట్టుకొని వాటిని సంచుల్లో నింపుకుపోయారు. చేపల వేటతో చెరువు పరిసరాలన్నీ చిన్నపాటి జాతరను తలపించింది.. ఆనందంగా చేతికి దొరికిన చేపలను దొరికినట్లే ఇంటికి తీసుకెళ్లిన తండావాసులు చేపల ఫ్రై, చేపల పులుసు, చేపలతో రకరకాల వంటకాలు చేసుకొని కడుపార పండుగ చేసుకున్నారు.
అయితే మృగశిర కార్తె సమీపిస్తున్న నేపథ్యంలో చేపలు ఆరోగ్యానికి మంచిది అంటున్న తండావాసులు ఇలా చెరువుపై పడి చెరువులను చేపలని లూటీ చేయడంపై మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఉప్పరగూడెం గ్రామానికి చెందిన మత్స్యకారులు ఈ చెరువును లీజుకు తీసుకొని ఇందులో చేపలను పెంచుతున్నారు.. చేప పిల్లలను పెంచి పెద్ద చేసి తీరా పట్టుకుని అమ్మే క్రమంలో ఇలా తండావాసులు చెరువు పై దాడి చేసి చేపలని లూటీ చేయడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.. సుమారు లక్ష యాభై వేల రూపాయల విలువగల చేపలు లూటీ అయ్యాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఆరాతీస్తున్నట్లు తెలిసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..