తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?

Fast Food Attributed Diabetes Index Study పేరుతో నిర్వహించిన ఈ పరిశోధనలో పలు ఆందోళనకర అంశాలు బయటపడ్డాయి. Indian Council of Medical Research ఆధ్వర్యంలో అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఈ అధ్యయనం చేపట్టారు. మధుమేహ బాధితులు ఎక్కువగా ఉన్న దక్షిణ భారత రాష్ట్రాల్లో Telangana ముందంజలో ఉందని నివేదిక వెల్లడించింది.

తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
Type 2 diabetes Telangana

Edited By:

Updated on: Mar 23, 2026 | 10:24 PM

తెలంగాణ పట్టణాల్లో జీవనశైలి వేగంగా మారుతోంది. పని ఒత్తిళ్లు, సమయాభావం, సౌకర్యాల పెరుగుదలతో సంప్రదాయ ఆహారపు అలవాట్లు తగ్గిపోతూ.. ఫాస్ట్ ఫుడ్ వినియోగం పెరుగుతోంది. ఈ మార్పు ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ఒక కొత్త డేటా ప్రకారం.. తెలంగాణ పట్టణ ప్రాంతాల ప్రజలు తమ నెలవారీ ఆహార వ్యయంలో 28 నుంచి 34 శాతం వరకు ఫాస్ట్ ఫుడ్‌పైనే ఖర్చు చేస్తున్నారు. దేశంలోనే అత్యధికంగా ఫాస్ట్ ఫుడ్‌పై ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ధోరణి వల్ల టైప్-2 మధుమేహం ప్రమాదం బాగా పెరుగుతోందని అధ్యయనం స్పష్టం చేసింది.

“ఫాస్ట్ ఫుడ్ అట్రిబ్యూటెడ్ డయాబెటిస్ ఇండెక్స్ స్టడీ” పేరుతో జరిగిన ఈ పరిశోధనలో ఆందోళనకర విషయాలు వెలుగుచూశాయి. భారత వైద్య పరిశోధన మండలి ఆధ్వర్యంలో, అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఈ అధ్యయనం జరిగింది. దక్షిణ రాష్ట్రాల్లో తెలంగాణే ముందంజలో ఉందని నివేదిక వెల్లడించింది. సంప్రదాయ ఆహారాల నుంచి ప్రజలు దూరమవుతూ.. అధిక కేలరీలు, కొవ్వులు, చక్కెరలతో నిండిన పారిశ్రామికంగా తయారైన ఆహారాలవైపు మళ్లుతున్నారని అధ్యయనం చెబుతోంది. ఈ మార్పు కారణంగా పట్టణాల్లో టైప్-2 మధుమేహం కేసులు క్రమంగా పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా మహిళల్లో ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం పట్టణ పురుషుల్లో సుమారు 3.8 శాతం మంది మధుమేహంతో బాధపడుతుండగా.. మహిళల్లో ఊబకాయం శాతం మరింత ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది. ఇది భవిష్యత్తులో మరిన్ని మధుమేహ కేసులకు దారితీయవచ్చని హెచ్చరికగా భావిస్తున్నారు.

అయితే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. అక్కడ ఫాస్ట్ ఫుడ్ వినియోగం తక్కువగా ఉండటంతో మధుమేహం ప్రమాదం కూడా గణనీయంగా తక్కువగా ఉందని అధ్యయనం తెలిపింది. జీవనశైలి, ఆహార అలవాట్లలో ఉన్న తేడాలే దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆరోగ్య నిపుణుల సూచన ఏమిటంటే.. ఫాస్ట్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించి, సంప్రదాయ ఆహారాలను తిరిగి అలవాటు చేసుకోవాలి. లేకపోతే… సౌకర్యాల కోసం తీసుకుంటున్న చిన్న నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సమస్యలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Follow Us