విశ్వాసంలో శునకానికి మించిన జంతువు మరొకటి లేదు. చాలామంది పెంపుడు కుక్కలను తమ కుటుంబ సభ్యుల మాదిరిగా అల్లారు ముద్దుగా చూసుకుంటారు. వాటితో అనుబంధాన్నిపెంచుకుంటారు. వాటికి ఏచిన్న హాని కలిగినా తల్లడిల్లిపోతారు. ఆ మూగ జీవులు కూడా తమ యజమాని పట్ల అదే ప్రేమ, విశ్వాసం కలిగి ఉంటాయి. యజమాని కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడతాయి. పెంచుకున్న శునకం చనిపోవడంతో సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు, కర్మకాండలు నిర్వహించి దానిపై ఉన్న మమకారాన్ని చాటుకున్నాడు ఓ జంతు ప్రేమికుడు.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని నయానగర్కు చెందిన భూసాని మల్లారెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు పిల్లలు లేరు. పిల్లలు లేని లోటుతో ఈ దంపతులు మానసికంగా కుంగిపోయారు. దీంతో వారు పదిహేనేళ్ల క్రితం ఓ శునకాన్ని తెచ్చుకొని స్వీటి అని పేరు కూడా పెట్టుకున్నారు. ఆ శునకాన్ని చిన్న పిల్లల మాదిరిగా అల్లారు ముద్దుగా పెంచారు. ఆ శునకం కూడా వారికి కుటుంబ సభ్యుడిగా మారిపోయింది. ఆ శునకానికి ప్రతి ఏటా బంధు మిత్రుల మధ్య బర్త్ డే వేడుకలను నిర్వహించేవారు.
15ఏళ్లుగా కుటుంబసభ్యుడిలా పెంచుకున్న శునకం మృతిచెందడంతో ఆ దంపతులు తట్టుకోలేక పోయారు. మనుషులు చనిపోతే చేసే విధంగానే ఆ శునకానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ శునకాన్ని ఇంటి ముందు ఉంచి.. పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్యాండ్ మేళాన్ని ఏర్పాటు చేసి వాహనంలో కోదాడ శివారులోని తన వ్యవసాయ పొలానికి తీసుకెళ్ళి ఆ దంపతులు శాస్త్రోక్తంగా ఖననం చేశారు. స్థానికులు, బంధువులను పిలిచి ఆ శునకానికి చిన్న, పెద్ద కర్మ కాండలు కూడా నిర్వహించారు. కుటుంబ సభ్యుడిగా పెంచుకున్న ఆ శునకం.. తమకు పిల్లలు లేనిలోటు తీర్చిందని మల్లారెడ్డి, ఈశ్వరమ్మ దంపతులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..