కాపురానికి రానని చెప్పిందని దారుణం.. భార్య ముక్కు కొరికేసిన భర్త!

కట్టుకున్న భార్యపై కసాయిలా మారాడు ఆ భర్త! కలిసి కాపురం చేద్దామని పిలిస్తే రాలేదన్న కోపంతో పగతో రగిలిపోయాడు. అత్తగారింటికి వెళ్ళి మామపై దాడి చేయడమే కాకుండా.. అడ్డువచ్చిన భార్య ముక్కును దారుణంగా కొరికేసాడు! పంటి కింద పడి భార్య ముక్కు తెగిపడటంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఈ అమానుష సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగిందంటే..

కాపురానికి రానని చెప్పిందని దారుణం.. భార్య ముక్కు కొరికేసిన భర్త!
Husband Allegedly Bites Wifes Nose

Edited By:

Updated on: Sep 16, 2026 | 12:51 PM

కోటపల్లి, సెప్టెంబర్ 16: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలో ఈ భయంకర ఘటన వెలుగుచూసింది. కోటపల్లికి చెందిన మమతకు, మల్లంపేట గ్రామానికి చెందిన మణి చందర్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ముద్దులొలికే ఆడపిల్లలు ఉన్నారు. ఎనిమిదేళ్ల పాటు సాఫీగానే సాగిన వీరి సంసారంలో కొద్దిరోజుల క్రితం మనస్పర్థలు మొదలయ్యాయి. గొడవలు తీవ్రమవ్వడంతో భర్తతో వేగలేక మమత తన ఇద్దరు పిల్లలతో కలిసి కోటపల్లిలోని పుట్టింటికి వచ్చేసింది. భార్య పుట్టింటికి వెళ్ళిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన భర్త మణి చందర్.. ఎలాగైనా ఆమెను కాపురానికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే కోటపల్లిలోని అత్తగారింటికి వచ్చాడు.

తనతో పాటు కాపురానికి రావాలంటూ భార్య మమతపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. అయితే మనస్పర్థలు తొలగిపోకపోవడంతో ఆమె రావడానికి నిరాకరించింది. దీంతో సహనం కోల్పోయిన మణి చందర్, అడ్డుగా వచ్చిన మామ నారాయణతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. మాటమాట పెరగడంతో ఆవేశంతో రగిలిపోయిన అల్లుడు.. పక్కనే ఉన్న కర్రను తీసుకుని మామ నారాయణ తలపై బలంగా బాదాడు. దీంతో ఆయన తల పగిలి తీవ్ర రక్తస్రావమై కిందపడిపోయాడు. కళ్లముందే తండ్రిపై దాడి జరుగుతుండటంతో తట్టుకోలేకపోయిన మమత.. భర్తను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. తండ్రిని కాపాడుకోవాలని చూసిన భార్యపై మణి చందర్ మృగంలా విరుచుకుపడ్డాడు. కసిగా ఆమెపై దాడి చేసి, అందరూ దిగ్భ్రాంతికి గురయ్యేలా భార్య ముక్కును పళ్లతో బలంగా కొరికేసాడు. భర్త కోరల దెబ్బకు మమత ముక్కు తీవ్రంగా తెగిపడి కిందపడిపోయింది. ఆమె తీవ్ర నొప్పితో పెడబొబ్బలు పెట్టినా వదలకుండా రాక్షసానందం పొందాడు.

ఇవి కూడా చదవండి

బాధితుల కేకలు విన్న చుట్టుపక్కల ప్రజలు వెంటనే అక్కడకు చేరుకోవడంతో నిందితుడు మణి చందర్ అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన తండ్రీకూతుళ్లను స్థానికులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మమత ముక్కు తీవ్రంగా దెబ్బతినడంతో, ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఎంజీఎంలో చికిత్స పొందుతోంది. బాధితుల ఫిర్యాదు మేరకు కోటపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న కరడుగట్టిన భర్త మణి చందర్ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ఎనిమిదేళ్ల బంధాన్ని, ఇద్దరు పిల్లల భవిష్యత్తును మరిచి భార్యపై ఇలాంటి అమానుష దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us