
సిద్ధిపేట.. తెలంగాణలో ఈ ప్రాంతానికి ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన ఈ పట్టణం ఇప్పుడు అభివృద్ధిలో రాష్ట్రానికి రోల్ మోడల్గా నిలుస్తోంది. తక్కువ సమయంలో ఊహించని అభివృద్ధితో అందరి దృష్టిని ఆకర్షిస్తోందీ పట్టణం. మంత్రి హరీష్ రావు ప్రత్యేక దృష్టితో అభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. కోమటి చెరువు, రంగనాయక సాగర్, గ్లో గార్డెన్ వంటి పర్యాటక ప్రదేశాలతో అట్రాక్ట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి కూడా పర్యాటకులు సిద్ధిపేట వస్తున్నారంటే అతిశయోక్తి లేదు.
ఇక పట్టణంలో ఇప్పటికే ఐటీ టవర్స్ ప్రారంభమైంది. అలాగే రంగనాయక్ సాగర్ను టూరిజానికి డెస్టినేషన్ గా మార్చే ప్రణాళికలు రచిస్తున్నారు. వీటితో పాటు డైనోసార్ పార్కును సైతం నిర్మిస్తున్నారు. ఇక సిద్ధిపేట అనగానే ముందుగా కొమటి చెరువు గుర్తొచ్చే స్థాయిలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. లేజర్ షో, హ్యాంగింగ్ బ్రిడ్జ్ వంటి ఎన్నో అద్భుతాలకు నెలవుగా మారింది కోమటి చెరువు. షార్ట్ మూవీస్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ వంటి వాటికి ఇప్పుడు కోమటి చెరువు అడ్డాగా మారింది. ఇంతలా అట్రాక్ట్ చేస్తున్న కొమటి చెరువు ఇప్పుడు మరో అద్భుతానికి వేదిక కానుంది. సిద్ధిపేట కోమటి చెరువు దగ్గర మెగా డ్రోన్ షో నిర్వహించనున్నారు.
సుమారు 4500 డ్రోన్లతో ఈ షోను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 27వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ డ్రోన్ షోను నిర్వహించనున్నారు. సిద్ధిపేటలో జరిగిన అభివృద్ధిని ఆకాశంతా ఎత్తులో చూపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో ట్యాంక్ బండ్ సమీపంలో ఏర్పాటు చేసిన అమర వీరుల స్థూపం ప్రారంభోత్సవం రోజున నిర్వహించిన డ్రోన్ షో ఎంతలా ఆకట్టుకుందో తెలిసిందే. ఇప్పుడు సిద్ధిపేటలోనూ అలాంటి డ్రోన్ షోను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. జిల్లా స్థాయిలో ఇలాంటి భారీ డ్రోన్ షోను నిర్వహించడం దేశంలోనే ఇదే తొలిసారి కావడం విశేషం.
తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన విజయాలకు సంబంధించిన విషాయాలను రంగురంగుల వర్ణాలతో ఆకాశంలో డ్రోన్ల రూపంలో చూపించనున్నారు. మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ మెగా డ్రోన్ ప్రదర్శన అభివృద్ధి పలలను సామాన్య మానవునికి సైతం అర్థమయ్యే విధంగా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించనున్నారు. ఈ డ్రోన్ షోకు ప్రజలు ఎత్తున హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..