
అడవి మధ్యలో కొలువైన ఆ పరమశివుడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు సాక్షాత్తు ఆ భోళాశంకరుడి ఆభరణమైన నాగేంద్రుడే దర్శనమిచ్చాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రి అడవుల్లో స్వయంభువుగా వెలసిన నీలాద్రీశ్వర స్వామి వారి ఆలయంలో ఈ అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. గంటసేపు ఆలయంలోనే పాము ఉండిపోవడంతో భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. కాకతీయుల కాలం నాటి చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయంలో శుక్రవారం ఉదయం అర్చకులు ఆలయ తలుపులు తీసి లోపలికి వెళ్లారు. శివలింగం ఉన్న అంతరాలయంలో భారీ నాగుపాము కనిపించడంతో ఒక్కసారిగా అర్చకులు, భక్తులు షాక్ అయ్యారు. శివలింగానికి సమీపంలోనే ఆ పాము దాదాపు ఒక గంట పాటు స్థిరంగా ఉండిపోయింది.
తొలుత భక్తులు భయాందోళనకు గురైనప్పటికీ, ఆలయ ప్రధాన అర్చకులు వారికి ధైర్యం చెప్పారు. దశాబ్దాలుగా ఇక్కడ వెలసిన నీలాద్రీశ్వర స్వామిని దర్శించుకోవడానికి సాక్షాత్తు నాగేంద్రస్వామి ఇలా పాము రూపంలో వస్తుంటారని, ఇది మొదటిసారి కాదని వివరించారు. దీంతో భక్తులు భయం వీడి, అది భగవంతుడి లీలగా భావించి తన్మయం చెందారు. అర్చకులు నాగుపాము ఉన్నప్పటికీ ఏమాత్రం కలవరపడకుండా స్వామి వారికి యధావిధిగా కైంకర్యాలు, అభిషేకాలు నిర్వహించారు. అద్భుతమైన విషయం ఏంటంటే.. పూజా కార్యక్రమాలు పూర్తిగా ముగిసే వరకు అక్కడే ఉన్న నాగుపాము, హారతి అనంతరం నిదానంగా అక్కడి నుండి అడవిలోకి వెళ్లిపోయింది. ఏకకాలంలో అటు శివుడిని, ఇటు శివుడి ఆభరణమైన నాగేంద్రుడిని దర్శించుకునే భాగ్యం కలగడం తమ అదృష్టమని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.