Disha accused encounter case: దిశ నిందితులు ఎన్‌కౌంటర్ కేసు తెలంగాణ హైకోర్టుకు బదిలీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ కేసును సుప్రీం కోర్టు.. తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. ఇకపై వాదనలు హైకోర్టులోనే వినిపించాలని స్పష్టం చేసింది.

Disha accused encounter case: దిశ నిందితులు ఎన్‌కౌంటర్ కేసు తెలంగాణ హైకోర్టుకు బదిలీ
Supreme Court

Updated on: May 20, 2022 | 1:13 PM

హైదారాబాద్‌(Hyderabad) నగర శివారల్లో దిశను అపహరించి.. సామూహిక అత్యాచారం చేసి.. పాశవికంగా హత్య చేసిన నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసును సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. అలాగే ఈ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ విలాస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌( Justice Sirpurkar Commission) నివేదికను బహిర్గతం చేయొద్దన్న తెలంగాణ(Telangana) ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో నివేదిక చూడకుండా కేసులో వాదనలు వినడం సాధ్యం కాదని వ్యాఖ్యానించింది.  సిర్పూర్కర్ కమిషన్‌ నివేదికను దాచాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం, పిటిషనర్లు ఇరువురికి కాపీలు ఇవ్వాలని ఆదేశించింది. సాఫ్ట్‌ కాపీ ఇవ్వాలని  సిర్పూర్కర్‌ కమిషన్‌ న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో…హైకోర్టు నిర్ణయిస్తుందని సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసును తాము ప్రత్యేకంగా మానిటర్‌ చేయలేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. కేసు తదుపరి విచారణ, తీసుకునే చర్యలపై హైకోర్టే నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. హైకోర్టు, కింది స్థాయి కోర్టులో ఏం జరుగుతుందో తెలియదన్న ధర్మాసనం.. సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక హైకోర్టుకు పంపుతామని తెలిపింది.

కమిషన్ నివేదికను సీల్డ్‌ కవర్‌లోనే ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాది శ్యామ్ దివాన్‌ వాదనలు వినిపించారు. ఈ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. నివేదిక గోప్యంగా ఉంచాల్సిన అవసరమేమి లేదని స్పష్టం చేసింది. కొందరు తప్పుచేసినట్టు తేలిందని, దానిని ప్రభుత్వం పరిశీలించాలని న్యాయస్థానం పేర్కొంది. రిపోర్టు వచ్చిందంటే దాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు.