
కొత్తగూడెం, జులై 12: సాంకేతిక రంగంలో దూసుకుపోతున్నాం.. డిజిటల్ ఇండియా అంటూ ఊదరగొడుతున్నాం.. కానీ నేటికీ కనీస సిగ్నల్స్ లేక కొండలు, గుట్టలు ఎక్కుతున్న జనాలు మనకు కనిపిస్తూనే ఉన్నారు. అలాంటి ఒక విచిత్రమైన, విచారకరమైన పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది. అక్కడ ఫోన్ మాట్లాడాలన్నా.. ఆఖరికి ఫోటో దిగాలన్నా ఆ ఊరి ప్రజలు ఒకే ఒక్క చోటికి చేరుకోవాల్సి వస్తోంది. పాల్వంచ మండలం పరిధిలోని సారేకల్లు, కారేగట్టు గ్రామాల్లో నెట్వర్క్ సమస్యలు వర్ణనాతీతంగా మారాయి. ఈ రెండు గ్రామాల ప్రజలకు సెల్ఫోన్ సిగ్నల్స్ అందక నానా అవస్థలు పడుతున్నారు. ఎవరికైనా ఫోన్ చేయాలన్నా, ఎవరిదైనా ఫోన్ రావాలన్నా వారు ఇళ్లను వదిలి ముత్యాలమ్మ బోడు’ అనే ప్రాంతానికి రావాల్సిందే! ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ బోడు వద్ద ప్రజలు గుంపులు గుంపులుగా చేరి తమ బంధువులతో మాట్లాడుకుంటూ కనిపిస్తున్నారు.
కేవలం ఫోన్ సంభాషణలకే కాదు.. ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ఇక్కడే ఆగిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రైతులు యూరియా బుక్ చేసుకోవాలన్నా సిగ్నల్ కోసం ముత్యాలమ్మబోడుకు రాక తప్పడం లేదు. ఐసీడీఎస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ ఫేస్ రికగ్నిషన్ హాజరును నమోదు చేసుకోవడానికి రోజూ ఇక్కడికే పరుగులు తీస్తున్నారు. ఆఖరికి అధికారులు జూమ్ మీటింగ్లు ఏర్పాటు చేస్తే.. సిబ్బంది అంతా ఈ చెట్ల కిందే కూర్చుని హాజరవుతారట. ఉపాధి హామీ కూలీలు తాము చేసిన పనికి సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేయాలన్నా ఈ బోడే దిక్కుగా మారింది.
ఏదైనా అత్యవసరమై 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వాలన్నా.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈ ప్రాంతానికి పరుగెత్తాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సమస్యపై స్పందించిన ఉన్నతాధికారులు ఇటీవల ఈ ప్రాంతానికి ఒక బిఎస్ఎన్ఎల్ (BSNL) ఎయిర్టెల్ టవర్ను అయితే మంజూరు చేశారు. కానీ, రెవెన్యూ అధికారులు టవర్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. స్థలం కేటాయింపు జరగకపోవడంతో టవర్ పనులు అక్కడే నిలిచిపోయాయి.ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి, టవర్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని.. తమ సిగ్నల్ కష్టాలను తీర్చాలని సోరేకల్లు, కారేగట్టు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.