
హైదరాబాద్ మహానగరంలో ఈరోజు సోమవారం (జూన్ 22) సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలు, అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థలకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కీలక సూచనలు జారీ చేసింది.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉద్యోగులు, విద్యార్థులు సాయంత్రం పీక్ అవర్స్కు ముందే గమ్యస్థానాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు మధ్యాహ్నం 3:30 గంటల నుంచే దశలవారీగా లాగ్అవుట్ అవకాశం కల్పించాలని కోరారు. భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద ట్రాఫిక్ జామ్లు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. అత్యవసర సేవల వాహనాలకు మార్గం కల్పించాలని, అనవసర ప్రయాణాలు తగ్గించాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ మహానగరంలో భారీ కురుస్తుందని హెచ్చరించింది. అలాగే నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్నగర్, మహబూబాబాద్, నాగర్కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Cyberabad Police Issues Key Advisories
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..