Kishan Reddy: కోవిడ్ ఆసుపత్రులను సందర్శించిన కిషన్ రెడ్డి.. నిన్న గాంధీ, కింగ్ కోటి.. ఇవాళ టిమ్స్‌ సందర్శన.. నేరుగా ఐసీయూకే..!

|

Apr 25, 2021 | 3:09 PM

కరోనా చికిత్స అందిస్తున్న ప్రధాన ఆసుపత్రులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరుసగా సందర్శిస్తున్నారు. నేరుగా ఐసీయూలోకి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు

Kishan Reddy: కోవిడ్ ఆసుపత్రులను సందర్శించిన కిషన్ రెడ్డి.. నిన్న గాంధీ, కింగ్ కోటి.. ఇవాళ టిమ్స్‌ సందర్శన.. నేరుగా ఐసీయూకే..!
Union Minister Kishan Reddy Visits Tims Hospital
Follow us on

Minister Kishan Reddy Hospital TIMS visits: పగబట్టినట్టు కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. చరిత్రలో ఎన్నడూ కనీవినని మారణహోమం సృష్టిస్తోంది. కోవిడ్ లక్షణాలను పసిగట్టేలోపే ఇంటిల్లిపాదిని కరోనా కకావికలం చేసేస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ప్రాణ వాయువు అందక ప్రాణాలు గాలిలోనే కలుస్తున్నాయి. హాస్పిటల్ బెడ్స్ అన్నీ పేపెంట్స్‌తో నిండిపోతున్నాయి. ఈ సమయంలో ప్రజలు, వైద్యులు, అధికారులకు కావల్సింది ఆత్మస్థైర్యం. మేమున్నామనే భరోసా. మనలో ఆత్మస్థైర్యం ఉంటే.. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చు. ఇదే క్రమంలో ఆందోళన అసలే వద్దు.. నేనున్నానంటూ రోగులకు భరోసా ఇస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హాస్పిటల్స్‌లో పర్యటిస్తూ.. క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. అన్ని విధాలుగా ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందంటున్నారు కేంద్ర మంత్రి.

కరోనా చికిత్స అందిస్తున్న ప్రధాన ఆసుపత్రులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరుసగా సందర్శిస్తున్నారు. నేరుగా ఐసీయూలోకి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. హాస్పిటల్స్‌లో వసతులపై ఆరా తీస్తూనే.. క్షేత్ర స్థాయి పరిస్థితుల గురించి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయని భరోసా ఇస్తున్నారు. ఆక్సిజన్ సరఫరా గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అవసరం మేరకు ఇతర దేశాల నుంచి ఆక్సిజన్ తెప్పిస్తున్నామన్న ఆయన.. కంపెనీలు ఉత్పత్తి చేసే ఇండస్ట్రియల్ ఆక్సిజన్‌ స్థానంలో మెడికల్ ఆక్సిజన్ తయారు చేయాలని ఆదేశించామన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు అన్ని విధాలుగా సాయం అందిస్తున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇదే క్రమంలో తెలంగాణ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్‌)ను సందర్శించిన కిషన్ రెడ్డి.. ఎయిర్ నుంచి ఆక్సిజన్ తయారు చేసే యూనిట్‌ను ఇప్పటికే హాస్పిటల్‌కు మంజూరు చేసినట్లు ప్రకటించారు. దీని నుంచి నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేయవచ్చన్నారు. ఇది త్వరలో ప్రారంభం కాబోతుందన్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. టిమ్స్‌లో 200 వెంటిలేటర్స్ ఉన్నాయన్న ఆయన.100 వెంటిలేటర్స్ ఖాళీగా ఉన్నాయని వివరించారు. కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్న కిషన్ రెడ్డి.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్న వారు వెంటనే టెస్ట్ చేయించుకోవాలని వివరించారు.

రాష్ట్రాలను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పదే పదే చెప్తున్న కిషన్ రెడ్డి.. ఇప్పుడున్న వివత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫండ్ ఉపయోగించుకోవాలన్నారు. ఆక్సిజన్ నుంచి టెస్ట్ కిట్స్ వరకు.. ఏ విషయంలోనూ కొరత లేదన్నారు. ప్రజల సహకారంతోనే కరోనాపై విజయం సాధ్యమన్న కిషన్ రెడ్డి.. పాటిజివ్ వచ్చిన వారు హోమ్ ఐసోలేషన్‌కు పరిమితం కావాలన్నారు.

ప్రతీ హాస్పిటల్‌లో బెడ్స్ లభ్యత, ఆక్సిజన్ నిల్వల గురించి అడిగి తెలుసుకుంటున్నారు కిషన్‌రెడ్డి. నిత్యం విధుల్లో ఉంటూ కరోనాతో పోరాటం చేస్తున్న వైద్య సిబ్బందికి నైతికంగా ఆత్మస్థైర్యం కల్పిస్తున్నారు. ఈ మధ్యే సొంత అన్న యాదగిరిరెడ్డిని కోల్పోయినా.. ప్రజల కోసం ఆస్పత్రుల్లో వసతులపై ఆరా తీస్తున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో హాస్పిటల్స్‌కు నేరుగా వెళ్లి ధైర్యం చెప్పడంతో అన్ని వర్గాల నుంచి ఆయనకు అభినందనలు వస్తున్నాయి.

Read Also…  Mohan Babu: వ్యాక్సిన్ రెండో డోస్ వేయించుకున్న మోహన్ బాబు.. ప్రజలకు విజ్ఞప్తి చేసిన కలెక్షన్ కింగ్..