CM KCR: ఫైనల్‌ స్టేజ్‌కు ప్రచారం.. ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్న సీఎం కేసీఆర్.. వ్యూహం మార్చబోతున్నారా..?

ఇంకా 3 రోజులే మిగిలింది. ఓటరు దేవుళ్ళు నిర్ణయం చెప్పే టైమ్ తరుముకొస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఎటు చూసినా ప్రచార రథాలు, విమానాలు, హెలికాప్టర్ల రోద పెరుగుతోంది. ఇప్పటిదాకా ఒక లెక్క..ఇకపై మరో లెక్క అంటున్నారు గులాబీ బాస్ కేసీఆర్. వ్యూహం మార్చి..కారు గేర్ మార్చడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారా? ఇప్పటివరకు సాగిన ప్రచారంపై కేసీఆర్‌కు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఏంటి? ఇకముందు కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతోంది?.

CM KCR: ఫైనల్‌ స్టేజ్‌కు ప్రచారం.. ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్న సీఎం కేసీఆర్.. వ్యూహం మార్చబోతున్నారా..?
CM KCR

Updated on: Nov 26, 2023 | 7:28 AM

తెలంగాణ ఎన్నికల తేదీ దగ్గరపడేకొద్దీ అన్ని పార్టీల అగ్రనాయకులు, అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. చావో రేవో అన్నట్లుగా అన్ని పార్టీలు పోరాడుతున్నాయి. విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ ప్రచారం చేసే అగ్రనేతలు.. రోడ్‌ షోలు.. ఇంటింటి ప్రచారాలతో అభ్యర్థులు బిజీ అయిపోయారు. ఇక అధికార BRS ప్రచారంలో స్పీడ్ పెంచేసింది. ఇప్పటివరకు జరిగిన ప్రచార సభలపై పార్టీ నేతల నుంచి సీఎం కేసీఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారట. గులాబీ బాస్ కేసీఆర్‌ వ్యూహం మార్చబోతున్నారనేది ప్రజెంట్‌ టాక్‌.

ప్రచార సరళి, డోర్ టూ డోర్ క్యాంపెయిన్‌పై ఆరా

గత వారం రోజుల నుంచి మాటల్లో పదును పెంచిన సీఎం కేసీఆర్ రాజకీయ తూటాలు భారీగా పేల్చుతున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వదులు కోవడం లేదు. ఇక ప్రచార సరళి, డోర్ టూ డోర్ క్యాంపెయిన్‌పై కూడా కేసీఆర్ ఆరా తీస్తున్నారట. సంక్షేమ పథకాలు అందిన లబ్దిదారులను ఎంత మందిని కలిశారు? వారి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? అంటూ అన్ని జిల్లాల నుంచి ఫీడ్ బ్యాక్ రిపోర్ట్ తీసుకున్నారట. అందులో సంక్షేమ పథకాలు పొందిన లబ్ధి దారులు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ గులాబీ బాస్‌కు అందింది. అంతేకాదు యువతలో కొంత వ్యతిరేకత ఉందని..ఎన్నికల తేదీ నాటికి వారికి భరోసా కల్పిస్తే పెద్దగా నష్టం ఉండదని BRS నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సభలు జరిగిన తీరు.. స్పందనపై ఫీడ్‌ బ్యాక్‌

రాష్ట్రంలోని అన్నీ నియోజకవర్గ ఇంచార్టీలతో ప్రత్యేకంగా కేసీఆర్ మాట్లాడినట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల పని తీరు బాగాలేని అభ్యర్థులకు కేసీఆర్‌ క్లాస్ పీకినట్లు గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పని తీరు మారకుంటే విజయం సాధించడం కష్టమేనని వారికి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయం వరకు ఏ మాత్రం ఏమరుపాటు పనికిరాదని కేసీఆర్ వారికి తెలిపినట్టు సమాచారం. నిన్నటి వరకు జరిగిన సభల తీరు, జనాల నుంచి ఎలాంటి స్పందన ఉందని వార్ రూం బాధ్యుల నుంచి కేసీఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారట.ప్రచారంలో మరింత దూకుడు పెంచాలని, ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకోవాలని కేసీఆర్ సూచించారని సమాచారం.

మరో రెండు మూడు కొత్త పథకాలు ప్రకటించే ఛాన్స్‌

ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో సర్వశక్తులు ఒడ్డాలని బీఆర్‌ఎస్‌ ప్లాన్‌ చేస్తోంది. ఇందుకోసం కేసీఆర్‌ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ మేనిఫెస్టోలపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి వాటిలో ఉన్న అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి, వీలయితే మరో రెండు మూడు కొత్త పథకాలతో జనంలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గ్రామీణ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని కొత్త హామీలు ఇస్తే జనం ఆలోచన ఖచ్చితంగా మారుతుందని, మళ్లీ అధికారం చేజిక్కించుకోవచ్చనే ధీమాతో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది.

హ్యాట్రిక్ సాధిస్తామని గులాబీ పార్టీ ధీమాగా ఉంది. అదే సమయంలో ఏమాత్రం ఏమరుపాటు తగదని కూడా కేసీఆర్ పార్టీ నేతలను, శ్రేణులను హెచ్చరిస్తున్నారు. మూడోసారి అధికారం కోసం ప్రచారంలో గేర్‌ మార్చి వ్యూహాలకు పదునుపెట్టనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..