
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో నాటు కోళ్ల దొంగతనం కలకలం రేపింది. మండల పరిధిలోని ఎడ్లబంజర గ్రామంలో యడ్ల సుబ్బారావు, మాణిక్యారావు అనే ఇద్దరు అన్నదమ్ములు కలిసి పెంచుతున్న పందెం పుంజుల నాటు కోళ్ల పెంపకం దుకాణంలో రెండు లక్షల రూపాయల విలువైన కోళ్లు చోరీకి గురయ్యాయి. అయితే నాటు కోళ్లు దొంగతనం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాల్లో మంకీ క్యాప్ ధరించిన దుండగుడు CC కెమెరాలను ఆపేందుకు కర్ర సహాయంతో ప్రయత్నం చేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి షాకుకు గురై కింద పడ్డాడు.
విద్యుత్ షాక్తో భయపడిన దొంగ మెల్లగా పిల్లి లెక్క అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి. రెండు రోజులు ముందు నాటు కోళ్ల పెంపకం దుకాణం వద్దకు వచ్చిన దుండగుడు రెండు కోడిపుంజులను బేరం చేసి రేటు ఎక్కువ అని చెప్పి కొనుగోలు చేయకుండా వెళ్లిపోయాడు. రెండు రోజుల తర్వాత అదే వ్యక్తి మంకీ క్యాప్ ధరించి అర్ధరాత్రి నాటు కోళ్లు దొంగతనం చేసాడని సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా యజమాని గ్రహించాడు. పగటిపూట కోళ్లు కొనేవారిలా షాప్నకు వచ్చి రాత్రుళ్ళు దొంగతనం చేస్తున్నారని యజమాని వాపోయాడు. దొంగలు నాటు కోళ్లు కూడా వదలకుండా దొంగతనం చేస్తుండటంతో స్థానికుల్లో కలకలం రేపుతుంది.