Telangana Assembly: కులగణన సర్వేలో ఆ నాయకులు పాల్గొనలేదు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Telangana Assembly: జనాభా లెక్కల్లోనూ బలహీనవర్గాల లెక్కలు పొందుపరచలేదని, అందుకే భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ రాష్ట్రంలో కులగణన చేస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు..

Telangana Assembly: కులగణన సర్వేలో ఆ నాయకులు పాల్గొనలేదు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Updated on: Feb 04, 2025 | 4:26 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశం కొనసాగుతోంది. కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చ మొదలైంది. సామాజిక, ఆర్థిక సర్వే నివేదికలు ఉభయసభల ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం. కుల-సర్వే 2024 నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో బలహీనవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు సహేతుకమైన సమాచారం లేదని, దీంతో రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి ఉందన్నారు. 1931 తరువాత భారతదేశంలో ఇప్పటి వరకు బలహీన వర్గాల సంఖ్య ఎంతో తేల్చలేదని అన్నారు. జనాభా లెక్కల్లోనూ బలహీనవర్గాల లెక్కలు పొందుపరచలేదని, అందుకే భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ రాష్ట్రంలో కులగణన చేస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. కులగణన ప్రక్రియను పూర్తి చేసి ఇవాళ నివేదికను సభలో ప్రవేశపెట్టామని అన్నారు. ప్రతీ గ్రామంలో, తండాల్లో ఎన్యూమరేటర్లు పకడ్బందీగా వివరాలు సేకరించారని, ప్రతీ 150 ఇండ్లను ఒక యూనిట్ గా గుర్తించి ఎన్యూమరేటర్లను కేటాయించి వివరాలు సేకరించామన్నారు.

76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు:

కులగణన కోసం రాష్ట్రంలో 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు కష్టపడి ఈ నివేదికను రూపొందించారని, రూ.160 కోట్లు ఖర్చుచేసి ఒక నిర్దిష్టమైన పకడ్బందీ నివేదిక రూపొందించామని పేర్కొన్నారు. పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తరువాత సభలో ప్రవేశపెట్టామన్నారు. 56 శాతం ఉన్న బీసీలకు సముచిత గౌరవం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, దేశానికి ఆదర్శంగా నిలిచేలా నివేదికను రూపొందించడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సర్వే నివేదికలో జనాభా లెక్కలలపై తేడాలు ఉన్నాయన్నారు.

రాష్ట్రంలో బీసీల జనాభా కోటి 64 లక్షలు

రాష్ట్రంలో బీసీల జనాభా కోటి 64 లక్షల 9 వేలు ఉన్నట్లు నివేదిక ద్వారా తెలుస్తోంది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీ జనాభా 51 శాతం ఉందన్నారు. శాస్త్రీయంగా చేసిన సర్వే ప్రకారం బీసీ జనాభా పెరిగినట్లు తేలిందని సీఎం రేవంత్‌ అన్నారు.

సర్వేలో కేసీఆర్‌,కేటీఆర్, హరీష్ రావు, పద్మారావు, డీకే అరుణ పాల్గొనలేదు

తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వేలో కేసీఆర్‌,కేటీఆర్, హరీష్ రావు, పద్మారావు, డీకే అరుణ పాల్గొనలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. భూముల వివరాలు చెప్పాల్సి వస్తుందనే కేసీఆర్‌ కుటుంబం సర్వేలో పాల్గొనలేదన్నారు. బీఆర్‌ఎస్‌ చేసిన సమగ్ర కుటుంబ సర్వే అధికారిక డాక్యుమెంట్ అయితే నివేదికను ఎందుకు కేబినెట్ లో పెట్టలేదని ప్రశ్నించారు. అలాగే అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, బీజేపీ, బీఆరెస్ లు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us