Telangana: ఆ 10మంది పరిస్థితి ఏంటి..? ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఎనీ టైమ్ తీర్పు.. రిజర్వ్‌ చేసిన హైకోర్టు..

|

Aug 07, 2024 | 8:53 PM

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత కేసులో ఎనీ టైమ్ తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలను విన్న తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనల తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేస్తూ కేసును వాయిదా వేసింది. దీంతో ఏక్షణమైనా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో తీర్పు వెలువడే అవకాశం ఉంది.

Telangana: ఆ 10మంది పరిస్థితి ఏంటి..? ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఎనీ టైమ్ తీర్పు.. రిజర్వ్‌ చేసిన హైకోర్టు..
Telangana Politics
Follow us on

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో జస్టిస్ విజయసేన్‌రెడ్డి బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను నిర్దిష్ట సమయంలోగా పరిష్కరించాలని స్పీకర్‌కు గడువు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని దీనిపై మీ వైఖరి చెప్పాలని అడ్వకేట్‌ జనరల్‌ను హైకోర్టు ప్రశ్నించింది. అయితే స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేయరాదన్నదే తమ వాదన అని అడ్వకేట్ జనరల్ వాదించారు. సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం ఉత్తర్వుల ప్రకారం ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై పిటిషన్లను మూడు నెలల్లోగా పరిష్కరించాలని బీఆర్ఎస్ తరపు లాయర్లు వాదించారు. అయితే బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని, కోర్టు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని ప్రభుత్వ లాయర్ వాదించారు.

పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌లు రాజకీయ లబ్ధి కోసమే పార్టీ మారారని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఒకరైన దానం నాగేందర్‌ అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కూడా చేశారని బీఆర్ఎస్ తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మణిపూర్, హిమాచల్‌ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినప్పుడు ఆ రాష్ట్రాల్లోని కోర్టులు వెలువరించిన తీర్పులను ధర్మాసానికి విన్నవించారు. స్పీకర్‌కు, మణిపూర్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన కాపీని సైతం కోర్టుకు అందజేశారు. ఈ క్రమంలో న్యాయస్థానాలు స్పీకర్‌కి ఆదేశాలు ఇవ్వడం వీలు పడదంటూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరఫున హాజరైన న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రజల చేత ఎన్నికైన నాయకుల విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని కోర్టుకు తెలిపారు. స్పీకర్‌ ముందున్న పిటిషన్లను విచారణ చేయాలని ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ప్రభుత్వ లాయర్ స్పష్టం చేశారు.

ఈ కేసు విచారణకు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యేల అనర్హతపై పిటీషన్లను స్పీకర్ పరిశీలించి తగిన నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనల తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేస్తూ కేసును వాయిదా వేసింది. దీంతో ఏక్షణమైనా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో తీర్పు వెలువడే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..