BRS: మరోసారి నల్లగొండ నుంచే ఉద్యమానికి సిద్ధమవుతున్న గులాబీ దళం.. కారుపార్టీ కొత్త వ్యూహం ఏంటి?

| Edited By: Balaraju Goud

Sep 28, 2024 | 8:13 PM

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్నా.. ఎన్నికల నాటి వేడి ఇంకా రాజుకుంటూనే ఉంది. పాలక ప్రతిపక్షాలు తగ్గేదేలె అంటున్నాయి. ఇలాంటి సందర్భంతో అత్యంత కీలకమైన స్థానిక ఎన్నికలు రాబోతుండటంతో.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ పక్కా వ్యూహం సిద్ధం చేస్తోందట.

BRS: మరోసారి నల్లగొండ నుంచే ఉద్యమానికి సిద్ధమవుతున్న గులాబీ దళం.. కారుపార్టీ కొత్త వ్యూహం ఏంటి?
Brs New Strategy
Follow us on

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్నా.. ఎన్నికల నాటి వేడి ఇంకా రాజుకుంటూనే ఉంది. పాలక ప్రతిపక్షాలు తగ్గేదేలె అంటున్నాయి. ఇలాంటి సందర్భంతో అత్యంత కీలకమైన స్థానిక ఎన్నికలు రాబోతుండటంతో.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ పక్కా వ్యూహం సిద్ధం చేస్తోందట. ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాటకు సన్నద్ధమవుతోంది. తనను పడగొట్టి.. కాంగ్రెస్‌ ఖిల్లా కట్టుకున్న ఆ జిల్లా నుంచే.. దాన్ని అమలు చేయబోతోందట..!

రేవంత్ సర్కార్ వైఫల్యాలపై భారత రాష్ట్ర సమితి పోరాటానికి సిద్ధమవుతోంది. ప్రజావ్యతిరేక విధానాలతో పాటు మంత్రుల వ్యవహార శైలి, అవినీతి, అరాచకాలు, అవినీతిని ఎండగట్టే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోంది. ఇప్పటి నుండే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు BRS ప్లాన్ చేస్తోందట. కదనరంగంలో దిగేందుకు అధినేతలు కేసీఆర్, కేటీఆర్ రెఢి అవుతున్నారట. నియోజక వర్గాల పర్యటనకు సిద్ధమవుతున్నారట. ఇందుకు మరోసారి నల్లగొండ నుంచే ఉద్యమానికి బీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోందన్న టాక్ వినిపస్తోంది.

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య వార్ నడుస్తోంది. రైతుబంధు, హైడ్రా వంటి కీలకమైన అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ నేతలు ముప్పేట దాడి చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరానికి సిద్ధమవుతోంది. ఇందుకు నల్లగొండ నుంచి శ్రీకారం చుట్టాలని బీఆర్ఎస్ భావిస్తోందట.

రాష్ట్రంలో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ ఎదురుదాడికి సిద్ధమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లో ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని కేసీఆర్ భావించారు. ఈ తొమ్మిది నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గట్టేందుకు బీఆర్ఎస్ కార్యచరణ రూపొందిస్తోందట. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హైడ్రా వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే హైడ్రా పై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డిలు ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు. హైదరాబాద్ జంట నగరాల పరిధిలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా హైడ్రాను అమలు చేసే అవకాశం ఉందంటూ బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. హైడ్రాను ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజా వ్యతిరేకతను పార్టీకి అనుకూలంగా మలుచుచుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోందట.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ వైఫల్యాలు, మంత్రుల వ్యవహార శైలి, అవినీతి, అరాచకాలు, ప్రజల్లో వ్యతిరేకతపై పోరాటాలతోపాటు బీఆర్‌ఎస్‌ కేడర్‌లో జోష్‌ నింపే దిశగా ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ దిశానిర్ధేశం చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి నివాసంలో జరిగిన ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతల సమావేశం జరిగింది. త్వరలో క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అన్ని జిల్లాల నుంచి మంత్రుల అవినీతి, అరాచకాల వివరాలను సేకరిస్తోంది. అధికార దర్పం, అహంకారంతో మంత్రులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నట్లు బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అరాచకాలపై త్వరలోనే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ యోచిస్తుందట.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నా.. బీఆర్ఎస్.. నల్లగొండ నుంచి సమర శంఖం పూరించాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నల్గొండ జిల్లాలో మళ్లీ ఫ్లోరోసిస్ భూతం తెరపైకి వచ్చిందన్న విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని గులాబీ పెద్దలు క్యాడర్ కు సూచిస్తున్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ని అంశాల్లో అడ్డగోలుగా వ్యవహరిస్తుండటంతో వారిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి ప్రభుత్వంపై సమరానికి శ్రీకారం చుట్టాలని గులాబీ అధినేత భావిస్తున్నారట. నియోజకవర్గం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నల్లగొండ నుండి గులాబీ అధినేత కేసీఆర్ కానీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టాలని జిల్లా నేతలు కోరుతున్నారు.

ప్రభుత్వంపై యుద్ధం చేస్తూనే మరోవైపు పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 నుండి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఉమ్మడి జిల్లాలో ఒంటరి పోరు సాగిస్తున్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి మద్దతుగా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించారు. పార్టీ క్యాడర్‌కు భరోసానిస్తూ మరింత బలోపేతం చేసేలా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. రానున్న కాలంలో ప్రభుత్వంపై ప్రజల్లో మరింత వ్యతిరేకత రావడం ఖాయమని, అందుకు అనుగుణంగా పార్టీ కార్యాచరణను సిద్దం చేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోందట.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..