
పార్లమెంట్ ఎన్నికల కోడ్ తర్వాత తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు మొదలయ్యాయి. తెలంగాణలో 14 పార్లమెంటు సీట్లు గెలవడమే టార్గెట్గా పెట్టుకున్న కాంగ్రెస్.. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తుంది. ఎన్నికల నగారా మోగడంతో పార్టీ ఫిరాయింపులను ప్రొత్సహిస్తున్నారు. తాము గేట్లు తెరిస్తే.. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందంటూ సీఎం రేవంత్రెడ్డి చెప్పిన కొద్దిసేపటికే ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్, టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో రంజిత్ రెడ్డి, దానం నాగేందర్ కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. దీంతో పార్లమెంటు ఎన్నికల వేళ బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది.
పార్లమెంట్ ఎన్నికల వేళ ఆపరేషన్ ఆకర్ష్తో బీఆర్ఎస్ కారును ఖాళీ చేయించే వ్యూహంతో సీఎం రేవంత్ ముందుకు సాగుతున్నారనే టాక్ వినిపిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ విపక్షాలు చేస్తున్న కామెంట్స్ ను సీరియస్గా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్.. తన మార్కు రాజకీయం చూపిస్తున్నారు. గంటలో బ్రేకింగ్ న్యూస్ ఇస్తానని చెప్పి, అన్నంతపనీ చేశారు. వందరోజుల పాలన నాడు రొటీన్ ప్రసంగాలు ఉంటాయని అనుకుంటున్నవేళ, నిజంగానే బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు. ప్రజెంట్ ఒక్క గేటు మాత్రమే ఎత్తితే ఇద్దరు చేరారు.. ఇక ముందుముందు ఎలా ఇంకా ఎంతమంది కాంగ్రెస్లో చేరతారో ఇప్పుడు చెప్పబోమన్నారు. వ్యూహాలు చెప్తే అవి వ్యూహాలు ఎందుకు అవుతాయంటూ సెటైర్లు వేశారు రేవంత్రెడ్డి.
రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. గతంలో ఫార్టీ ఫిరాయింపులకు పాల్పడితే రాళ్లతో కొట్టి చంపాలని సీరియస్ కామెంట్స్ చేసిన రేవంత్రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీని కాంగ్రెస్లో ఎలా చేర్చుకున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ప్రజల ఓట్లతో, కార్యకర్తల చెమట చుక్కలతో గెలిచిన వ్యక్తులు నిస్సిగ్గుగా పార్టీ మారుతున్న వ్యక్తులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు దాసోజు శ్రవణ్.
హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఎంపీ సీట్లపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకు సాగుతుంది. చేవెళ్ల నుంచి మొదట సునీతా మహేందర్ రెడ్డిని బరిలోకి దింపాలని భావించినప్పటికీ.. ఇప్పుడు రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఆయనను బరిలో దింపాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక సునీతా మహేందర్ రెడ్డిని చేవెళ్లకు బదులుగా మల్కాజ్గిరి నుంచి బరిలోకి దింపి కాంగ్రెస్ సిట్టింగ్ సీటును మరోసారి చేజిక్కించుకోవాలని రేవంత్రెడ్డి వ్యూహ్యాలు రచిస్తున్నారు. మల్కాజ్గిరి సీటును ఎలాగైనా గెలిపించుకోవడంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఇక సికింద్రాబాద్ స్థానం నుంచి దానం నాగేందర్ను పోటీ చేయించే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు టాక్. ఇందుకోసం దానంను కాంగ్రెస్ నేతలు ఒప్పించినట్టు సమాచారం. అయితే దానం నాగేందర్ సికింద్రాబాద్ బరిలో ఉంటారా ? లేక మరో ముఖ్యనేత కుమారుడు ఈ రేసులోకి వస్తారా ? అనేది రెండుమూడురోజుల్లో క్లారిటీ రానుంది. ఇప్పటికే ఎన్నికల కోడ్ కూడా రావడంతో సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది టీకాంగ్రెస్. టార్గెట్ 14 లక్ష్యంగా ముందుకెళ్తుంది.
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మాల్కాజ్గిరిపై ఫోకస్ చేసిన బీఆర్ఎస్ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నివాసంలో ఆపార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద, మర్రి రాజశేఖర్ హాజరయ్యారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సీటులో బీఆర్ఎస్ గెలుపు వ్యూహంపై చర్చించారు. మల్కాజ్గిరి పార్లమెంట్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. అయితే కారును ఖాళీ చేయించి పార్లమెంటు ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని రేవంత్ స్కెచ్ వేస్తుంటే…నేతలను కాపాడుకునే పనిలో పడింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..