
ప్రకృతి ప్రేమికులకు కేరాఫ్ అడ్రస్, వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం పాకాల సరస్సు ఇప్పుడు భయాందోళనలకు వేదికైంది. నిత్యం పర్యాటకుల కేరింతలు, బోటింగ్ సందడితో కళకళలాడే ఈ సరస్సు ఒడ్డున గుర్తు తెలియని వ్యక్తులు నిర్వహించిన క్షుద్రపూజలు స్థానికంగా పెను కలకలం రేపాయి. చుట్టూ దట్టమైన అడవి, పచ్చని ప్రకృతి అందాల మధ్య విడిది చేసేందుకు వచ్చే పర్యాటకులకు సరస్సు మత్తడి సమీపంలో కనిపించిన దృశ్యాలు హడలెత్తించాయి. గుర్తుతెలియని వ్యక్తులు రహస్యంగా పూజలు నిర్వహించిన ఆనవాళ్లు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఘటనా స్థలంలో పసుపు, కుంకుమ, పూజా సామాగ్రి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. క్షుద్రపూజల్లో భాగంగా నిమ్మకాయలు ఉపయోగించడమే కాకుండా, కోడిని బలి ఇచ్చిన ఆనవాళ్లు చూసి పర్యాటకులు షాక్కు గురయ్యారు.
సాధారణంగా పర్యాటకులు ఎంతో ప్రశాంతత కోసం పాకాలకు వస్తుంటారు. కానీ ఇలాంటి విచిత్ర పూజలు వెలుగుచూడటంతో సందర్శకులు సరస్సు పరిసరాల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఎక్కడో పూజలు చేసి ఆ సామాగ్రిని ఇక్కడ పడేశారా? లేక పర్యాటకుల ముసుగులో వచ్చి అర్ధరాత్రి వేళ ఈ వికృత పూజలకు పాల్పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పర్యాటక ప్రాంతంలో నిఘా లోపం వల్లే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు.
చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పాకాల సరస్సు ప్రతిష్టను ఇలాంటి సంఘటనలు దెబ్బతీస్తున్నాయని పర్యాటక ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో సరస్సు పరిసరాల్లో నిఘా పెంచాలని, ఇలాంటి క్షుద్రపూజలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను, అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. అందమైన పర్యాటక కేంద్రం క్షుద్రపూజలకు అడ్డాగా మారడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మరి అధికారులు స్పందించి పాకాలకు పూర్వవైభవం, భద్రత కల్పిస్తారో లేదో వేచి చూడాలి.