రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలు..10 వేల మందితో సంబురాలు.. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

|

Oct 09, 2024 | 8:09 AM

ఓవైపు దసరా నవరాత్రి ఉత్సవాలు.. మరోవైపు బతుకమ్మ సంబరాలతో తెలంగాణ సందడి నెలకొంది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ నేపధ్యంలో  హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌పై రేపు సద్దుల బతుకమ్మ వేడుకలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్‌ శాంతికుమారి సమీక్ష నిర్వహించి.. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.

రేపే ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలు..10 వేల మందితో సంబురాలు.. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Batumakamma 2024
Follow us on

హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌ వద్ద జరిగే సద్దుల బతుకమ్మ వేడుకల్లో దాదాపు 10 వేల మంది మహిళలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు సీఎస్‌ శాంతికుమారి. సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎస్‌.. వివిధ శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులతో వేడుకల ఏర్పాట్లపై చర్చించారు. బతుకమ్మ వేడుకలకు మహిళలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.

ట్యాంక్ బండ్‌ చిల్డ్రన్‌ పార్క్‌లో ఉన్న బతుకమ్మ ఘాట్‌తోపాటు నెక్లెస్ రోడ్డులో బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులను సూచించారు. ట్యాంక్‌బండ్‌పై బతుకమ్మ ఉత్సవాల నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్, బారికేడింగ్‌ ఏర్పాట్లపై పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతీ శాఖ ఒక సీనియర్ అధికారిని ప్రత్యేకంగా నియమించి ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు సీఎం శాంతికుమారి.

గురువారం సాయంత్రం నాలుగు గంటలకు అమరవీరుల స్మారక కేంద్రం నుండి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్‌బండ్ పైకి చేరుకుంటారని.. వారితోపాటు వందలాది మంది కళాకారులు వివిధ కళారూపాలతో ర్యాలీగా వస్తారని తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై జరిగే బతుకమ్మ ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు.

ఇవి కూడా చదవండి

బుద్ధ విగ్రహం, సంజీవయ్య పార్క్‌ నుండి ప్రత్యేకంగా బాణాసంచా కాల్చే కార్యక్రమం, లేజర్ షో ఉంటుందని వెల్లడించారు. ఇక.. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా.. పండుగ శోభ సంతరించుకునేలా ఇప్పటికే హైదరాబాద్‌లోని 150 ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఏర్పాటు చేయడంతోపాటు.. జంక్షన్లను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. అలాగే.. ప్రధాన కార్యాలయాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..