తెలంగాణలో బీజేపీ 8 లోక్ సభ స్థానాల్లో గెలిచిన జోష్లో ఉంది. రాష్ట్రంలో ఓట్ల శాతం గణనీయంగా పెంచుకున్న కమలనాథులకు కొత్త చిక్కు వచ్చి పడింది. తెలంగాణలో బీజేపీ ఫేస్గా చెప్పుకునే నేతలంతా ఎంపీలుగా గెలిచారు. ఇద్దరు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకున్నారు. వీరికి తోడుగా బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ ఉండనే ఉన్నారు. వీళ్లే కాకుండా అదనంగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ జాతీయ నేతగా ఉన్నప్పటికీ తెలంగాణ బీజేపీలో కీలకంగా ఉన్నారు. ప్రజా ప్రతినిధుల సంఖ్య భారీగా పెంచుకున్న తెలంగాణ బీజేపీకి అసలు సమస్యే ఇక్కడే మొదలైంది.
పార్టీ నుంచి ప్రజా ప్రతినిధులు పెరగడంతో ఆటోమెటిక్గా పార్టీలో పవర్ సెంటర్స్ ఎక్కువయ్యాయి. బీజేపీ రాష్ట్ర సారథిగా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి.. కేంద్ర మంత్రి వర్గంలో మరోసారి చోటుదక్కించుకున్నారు. కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. గెలిచిన ఎంపీల్లో ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ వీళ్లంతా ఎవరికి వారు పార్టీలో పవర్ సెంటర్స్గానే చెప్పుకోవచ్చు. గెలిచిన ఎంపీలను సన్మానించడానికి వెళ్లిన నేతలు.. ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి భయపడుతున్నారు. కిషన్ రెడ్డి మనిషిగా.. బండి సంజయ్ మనిషిగా.. ఈటల రాజేందర్ మనిషిగా ముద్ర పడితే.. పొలిటికల్ కేరియర్ ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని జంకుతున్నారు. ఫలానా వారి మనిషి అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు రావేమోనని భయం క్యాడర్ లో పట్టుకుంది. బీజేపీ రాష్ట్ర నేతల మధ్యవిభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్న నేపథ్యంలో ఒక నేత దగ్గరకు వెళ్తే.. మరో నేత ఫీల్ అవుతారేమోనని బీజేపీ శ్రేణులకు గుబులు పట్టుకుంది. మొత్తంగా బీజేపీ క్యాడర్.. గెలిచిన ఎంపీలను, మంత్రులను చాటుమాటుగా కలిసి తమ భక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..