T Congress Meet: తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు మారదా?.. గల్లీలో అయినా, ఢిల్లీలో అయినా అదే పంచాయితీ!

|

Nov 13, 2021 | 4:30 PM

తెలంగాణ కాంగ్రెస్‌పై ఢిల్లీలో పోస్ట్‌మార్టం నడుస్తోంది. పార్టీ ఢీలా పడటానికి కారణాలేంటి? హుజురాబాద్ ఎన్నికల్లో ఘోర పరాజయానికి రీజన్స్ ఏంటి అంటూ అధిష్టానం ఆరా తీస్తుంది.

T Congress Meet: తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు మారదా?.. గల్లీలో అయినా, ఢిల్లీలో అయినా అదే పంచాయితీ!
Telangana Congress Leaders
Follow us on

T Congress Meet i Delhi: తెలంగాణ కాంగ్రెస్‌పై ఢిల్లీలో పోస్ట్‌మార్టం నడుస్తోంది. పార్టీ ఢీలా పడటానికి కారణాలేంటి? హుజురాబాద్ ఎన్నికల్లో ఘోర పరాజయానికి రీజన్స్ ఏంటి అంటూ అధిష్టానం ఆరా తీస్తుంది. 13 మంది ముఖ్యనేతలతో అధిష్టానం దూత కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు. ఢిల్లీ సమావేశంలోనూ టీ కాంగ్రెస్ నేతలు అదే తీరుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలకు తోడు పాత పంచాయితీలను తోడుకున్నట్లు సమాచారం. అధిష్టాన దూత ముందే ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్నట్లు తెలుస్తోంది.

మారరా? టీ కాంగ్రెస్ నేతల తీరు మారదా? గల్లీలో అయినా, ఢిల్లీలో అయినా అదే పంచాయితా? అంటే అవుననే అంటున్నారు టీకాంగ్రెస్ నేతలు. మేమింతే మా తీరు ఇంతే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం నేతల మధ్య చిచ్చు రాజేసింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఢిల్లీకి వెళ్లాక కూడా అదే సీన్‌ రిపీట్ అవుతోంది. ఏఐసీసీ పిలుపుమేరకు.. కాంగ్రెస్‌ ముఖ్యనేతలు ఢిల్లీ వెళ్లారు. ఇప్పటికే హుజూరాబాద్‌ ఫలితంపై అధ్యయనం చేసేందుకు కమిటీ వేసిన అధిష్టానం.. ఘోర ఓటమిపై నేతలతో చర్చిస్తున్నారు. 2018 ఎన్నికల్లో 60 వేలకు పైగా ఓట్లు వస్తే.. ఉపఎన్నికలో 3 వేల ఓట్లకే పరిమితం కావడంపై సమీక్షించారు. కేవలం 1.46 శాతం ఓట్లకు పరిమితం కావడంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్‌గా ఉంది. దీంతో ఇవాళ ఢిల్లీకి రావాల్సిందిగా 13 మంది నేతలను హైకమాండ్ ఆదేశించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు .. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌తో సహా ఎన్నికల్లో భాగస్వాయ్యం అయిన నేతలను ఢిల్లీకి రావాల్సిందిగా సూచించింది. అయితే ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి మొదట్లో పిలుపు అందినా తర్వాత నిలిపేశారు. మహేశ్వర్ రెడ్డి ప్లేస్‌లో ములుగు ఎమ్మెల్యే సీతక్కను ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించారు. దీంతో వారంతా హస్తినకు చేరుకున్నారు.

ఢిల్లీలో హుజురాబాద్‌ పోస్ట్‌మార్టం. కీలక నేతలను పిలిచిన అధిష్టానం వైఫల్యాలపై ఆరా తీస్తోంది. వార్‌రూమ్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు క్లాస్‌ తీసుకుంటోంది. ఉదయం ఒక దఫా మీటింగ్‌ నిర్వహించగా.. పొంతనలేని సమాధానాలతో తోడు.. ఫిర్యాదుల వెల్లువెత్తాయి. దీంతో చిరాకు పడ్డ పార్టీ జనరల్ సెక్రెటరీ KC వేణుగోపాల్‌ మీటింగ్‌ను సాయంత్రం 6 గంటలకు వాయిదా వేశారు. ఇటీవల దేశంలో జరిగిన బైపోల్స్‌లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించినా.. హుజురాబాద్‌లో మాత్రం మరీ దారుణమైన రిజల్ట్ వచ్చింది. దీనిపై ఢిల్లీ పెద్దలు సీరియస్‌గా ఉన్నారు. దీంతో పాటు లేటెస్ట్ పొలిటికల్ డెవలప్‌మెంట్స్‌పై అధిష్ఠానం ఆరా తీస్తోంది.

హుజురాబాద్ ఓటమికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైఖరే కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు గట్టిగా ఆరోపిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం కోసం రేవంత్ పనిచేశారని వారు హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కనీసం సహకరించలేదని రేవంత్ వర్గం గుర్తు చేస్తోంది. ముఖ్యంగా హుజురాబాద్ ఎన్నిక పార్టీల మధ్య జరగలేదని.. కేసీఆర్, ఈటల మధ్య జరిగిందని రేవంత్ వర్గం హైకమాండ్‌కు నచ్చచెప్పే పనిలో ఉంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో హుజూరాబాద్‌ వివాదం కంటిన్యూ అవుతోంది. ఢిల్లీ వేదికగా ఒక వైపు వార్‌ రూమ్‌లో హాట్‌ హాట్‌ డిస్కషన్‌ నడుస్తుంటే… మరోవైపు జగ్గారెడ్డి లేఖ దుమారం రేపుతోంది. పార్టీ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌కి లేఖ రాశారు జగ్గారెడ్డి. హుజూరాబాద్‌ రివ్యూకి తనను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. కరీంనగర్‌ పార్లమెంటుఇన్‌ఛార్జ్‌గా ఉన్నానని, అభ్యర్థిని 3 నెలల ముందు ఎందుకు నిర్ణయించలేదని ప్రశ్నించారు. అభ్యర్థి దగ్గర డబ్బులు లేకపోయినా.. పీసీసీ అధ్యక్షుడు పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నారు జగ్గారెడ్డి. నామినేషన్లకు ముందురోజు అభ్యర్థిని నిర్ణయిస్తారా అని ప్రశ్నించారు.

Read Also… Amit Shah: గుజరాతీ కంటే ఆ భాష అంటేనే ఎక్కువ ప్రేమ.. సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంత్రి అమిత్ షా!

 Turkish Politician Wife: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. టైపో మిస్టేక్.. కొంపముంచిన అక్షర దోషం.. రాజకీయనేత భార్యకు జైలు శిక్ష ..