Minister KTR: స్వరాష్ట్రంలో పెన్షన్లను పది రెట్లు పెంచినం.. ఈనెల 5 నుంచి రేషన్ కార్డులు పంపిణి చేస్తాంః మంత్రి కేటీఆర్

| Edited By: Ravi Kiran

Jul 01, 2021 | 5:53 PM

ప్రాణవాయువును అందించే చెట్లను ప్రతి ఇంట్లోనూ పెంచాలని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఇవాళ్టి నుంచి పట్టణ, పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలు మొదలయ్యాయి.

Minister KTR: స్వరాష్ట్రంలో పెన్షన్లను పది రెట్లు పెంచినం.. ఈనెల 5 నుంచి రేషన్ కార్డులు పంపిణి చేస్తాంః మంత్రి కేటీఆర్
Minister Ktr Siricilla Tour
Follow us on

Minister KTR Siricilla tour: ప్రాణ వాయువును అందించే చెట్లను ప్రాణంతో సమానంగా రక్షించుకోవాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. పుట్టినప్పటి నుంచి చావు వరకు మనుషుల జీవితాల్లో చెట్లే ఎంతో కీలకమన్నారు. కరోనా సెకండ్‌వేవ్‌లో ఆక్సిజన్‌ అందక జనం చనిపోయినప్పుడు హృదయం కదిలిపోయిందన్నారు. అలాంటి ప్రాణవాయువును అందించే చెట్లను ప్రతి ఇంట్లోనూ పెంచాలన్నారు. తెలంగాణలో ఇవాళ్టి నుంచి పట్టణ, పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలు మొదలయ్యాయి.

గంభీరావుపేట మండ‌లం రాజ‌పేట‌లో నిర్వహించిన‌ ప‌ల్లె ప్రగ‌తి కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నానికి శంకుస్థాప‌న చేశారు. హ‌రిత‌హారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంత‌రం అక్కడ ఏర్పాటు చేసిన స‌భ‌లో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. 70 ఏళ్లలో జ‌ర‌గ‌ని అభివృద్ధి కార్యక్రమాల‌ను ఏడేళ్లలో చేసి చూపించామ‌ని తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి కొత్త రేష‌న్ కార్డులు జారీ ప్రక్రియ చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. బడుగు, బలహీనవర్గాలకు ఆదుకునేందుకు ఆస‌రా పెన్షన్లు 10 రెట్లు పెంచామ‌ని పేర్కొన్నారు. 57 ఏళ్ల నిండిన ప్రతి పేదవారికి త్వర‌లోనే పెన్షన్లు అందిస్తామ‌న్నారు.

తెలంగాణ కల్పతరువు కాళేశ్వరం ప్రాజెక్టు వ‌ల్లే మానేరు నిండింద‌న్నారు. స్వరాష్ట్రం సాధించాకే చెరువులు బాగు ప‌డ్డాయ‌ని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాకే రాష్ర్టంలో 24 గంట‌ల క‌రెంట్ వ‌చ్చింద‌న్నారు. ఎర్రటి ఎండ‌ల్లోనూ న‌ర్మాల చెరువు మ‌త్తడి దుంకింద‌ని గుర్తు చేశారు. చెరువుల నిండా నీళ్లు ఉండ‌టంతో మ‌త్స్యకారులు సంతోషంగా ఉన్నారని, త్వర‌లోనే రెండో విడ‌త గొర్రెల పెంప‌కం చేప‌డుతామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు.

పల్లెల్లో హరితహారం కార్యక్రమం విధిగా చేపట్టాలన్న మంత్రి .. రాష్ర్టంలోని 12,769 గ్రామ పంచాయ‌తీల్లో ట్రాక్టర్, ట్యాంక‌ర్, న‌ర్సరీ ఏర్పాటు చేశామ‌న్నారు. రైతుబంధు స్ఫూర్తితో కేంద్రం పీఎం కిసాన్ అమ‌లు చేస్తోంద‌న్నారు. ప్రతి ఇంట్లో ఉన్న ఒక్కొక్కరు క‌నీసం ఒక మొక్క నాటి పెంచాల‌ని సూచించారు. రాజుపేట‌లో మ‌హిళా సంఘం భ‌వ‌నం త్వరలోనే నిర్మిస్తామ‌ని కేటీఆర్ స్పష్టం చేశారు.

Read Also…  AP Irrigation Officials: తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న నీటి పంచాయితీ.. ఏపీ అధికారులను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు