కన్నీరు పెట్టించే విషాదం.. భవనంపై నుంచి పడి మూడేళ్ల చిన్నారి మృతి

| Edited By: Srikar T

Apr 01, 2024 | 9:40 AM

హైదరాబాద్ శివారు కీసరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భవనంపై నుంచి పడి 3 సంవత్సరాల చిన్నారి ప్రాణాలు విడిచింది. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడి అమ్మానాన్నలకు తీరని దు:ఖాన్ని మిగిల్చింది.

కన్నీరు పెట్టించే విషాదం.. భవనంపై నుంచి పడి మూడేళ్ల చిన్నారి మృతి
Baby Die
Follow us on

హైదరాబాద్ శివారు కీసరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భవనంపై నుంచి పడి 3 సంవత్సరాల చిన్నారి ప్రాణాలు విడిచింది. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడి అమ్మానాన్నలకు తీరని దు:ఖాన్ని మిగిల్చింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కీసర మండలం నాగారం తూర్పుగాంధీనగర్‌లో నివసించే ఆర్‌.సాయికుమార్‌, కనకదుర్గ దంపతులు స్థానికంగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి మూడేళ్ల కుమార్తె భవ్య ఈనెల 28న సాయంత్రం బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడింది. చిన్నారి తలకు తీవ్ర గాయాలవ్వడంతో.. వెంటనే గాంధీ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వారికి ప్రమాదం ఎటు నుంచి ముంచుకొస్తుందో తెలీదు. అందుకు ఒక మనిషి నిత్యం కాపలాగా ఉండాలి. ముఖ్యంగా సిటీల్లో పిట్ట గోడలు చిన్నగా ఉంటాయి. కరెంట్ వైర్లు కూడా బిల్డింగులకు ఆనుకోని ఉంటాయి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే కాస్త పిల్లల్ని కనిపెడుతూ ఉండండి. పైగా ఇప్పుడు వేసవి కాలం ప్రారంభమైంది. పిల్లలందరికీ వేసవి సెలవులు వస్తున్నాయి. ఆటపాటలతో ఇరుగుపొరుగు పిల్లలందరూ ఒక్కచోటు గుమిగూడుతారు. ఇలాంటి సమయంలో వారిపై ఒక కన్ను వేసి ఉండటం మంచిది. ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా కాపాడుకోవచ్చు. ప్రమాదం జరిగిన తరువాత బాధపడేకంటే.. ప్రమాదాన్ని ముందుగా అంచనావేసి జాగ్రత్తలు పాటిస్తే మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..