
మల్లన్నసాగర్ జలాలు త్వరలో హైదరాబాద్ వైపు పరుగులు తీయనున్నాయి. హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చేందకు ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే అందిస్తున్న కృష్ణా, మంజీరాకు తోడు మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలతో నగర దాహార్తి తీర్చబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు జోరుగా జరుగుతున్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి హైదరాబాద్కు మంచినీటి పథకం పనులు వేగంగా జరుగుతున్నాయి.
సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ హైదరాబాద్ భవిష్యత్తు అవసరాలకు కల్పతరువుగా మారనుంది. 50 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్ రాజధాని ప్రజల గొంతు తడపడానికి ఉపయోగబడబోతుంది. ప్రస్తుతం హైదరాబాద్కు కృష్ణా, గోదావరి, మంజీరా నదుల నుంచి మంచినీటి సరఫరా జరుగుతుంది. రోజు రోజుకు పెరుగుతున్న నీటి అవసరాలను అంచనా వేస్తూ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
మల్లన్న సాగర్ రిజర్వాయర్ కెపాసిటి 50 టిఎంసిలు కావడంతో ఇందులో సాగునీటి అవసరాల కోసం 30 టిఎంసిల నీటిని వినియోగించి మిగతా 20 TMCల నీటిని హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం వాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో తాగునీటి పరిష్కారం కోసం గోదావరి సుజల స్రవంతి పథకాన్ని పన్నెండేళ్ల క్రితమే 3వేల 375 కోట్లతో పూర్తి చేసారు. ఈ పథకం కింద ఎల్లంపల్లి బ్యారేజి నుంచి ఏటా 10 టీఎంసిల నీటిని హైదరాబాద్ కు సరఫరా చేస్తున్నా.. మహానగర వాసుల దాహార్తికి తిప్పలు తప్పడం లేదు. ఈ పరిస్తితిని దృష్టిలో పెట్టుకుని మల్లన్న సాగర్ మంచినీటి పథకానికి రూపకల్పన చేశారు. 4వేల 500 కోట్ల వ్యయంతో 198 కిలోమీటర్ల మేర పైప్ లైన్
పనులు వాయు వేగంతో జరుగుతున్నాయి.
మల్లన్నసాగర్ రిజర్వాయర్లో డెడ్ స్టోరేజ్ 5TMCల కెపాసిటీ ఉండడంతో పంపింగ్ అవసరం లేకుండానే గ్రావిటీ ద్వారా నీటి తరలింపు సాధ్యమవుతుందని అంచనా వేశారు అధికారులు. ఈ పనులను హైబ్రిడ్ యాన్యూటీ పద్దతిలో చేపట్టాలని నిర్ణయించారు. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు తరలించే నీటితో కేవలం తాగునీటి అవసరాలే కాకుండా మూసీ పునరుజ్జీవానికి కూడా ఈ జలాలను వాడాలని.. అందుకు కావలసిన ప్రత్యేక కార్యాచరణను సైతం ఈ పథకంలో రూపొందించారు. మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ ఈ టెండర్లను దక్కించుకుని పనులు చేస్తోంది. రెండేళ్లు టైం ఉన్నా.. 18 నెలల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని మెగా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
హైదరాబాద్ ప్రజలకు 50 ఏళ్లుగా తాగునీటి అవసరాలు తీరుస్తున్న సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాల్సిన పరిస్థితులు రావడంతో ప్రస్తుతం ప్రాజెక్టును ఖాళీ చేస్తున్నారు అధికారులు. ఏటా 7 టిఎంసిల నీటిని సింగూరు ప్రాజెక్టు నుంచి తాగునీటి కోసం వాడుతున్నారు. ప్రాజెక్టు అప్ స్ట్రీమ్ రివైట్మెంట్ దెబ్బ తినడంతో సింగూర్ ప్రాజెక్టుకు వెంటనే మరమ్మతులు చేయాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరించింది. దీంతో రాబోయే రోజుల్లో నగరానికి తాగునీటి ఇబ్బందులు తప్పవని భావించి ముందస్తుగా.. మల్లన్నసాగర్ నీటి తరలింపు పనుల్లో వేగం పెంచారు.
సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ గ్రామం నుంచి గజ్వేల్ నియోజక వర్గం సిద్దాపూర్ వరకు ప్రస్తుతం పైప్ లైన్ పనులు జరుగుతున్నాయి. మల్లన్న సాగర్లో ఒకవేళ నీటి మట్టాలు తగ్గితే పైనున్న కోండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సైతం నీటని వాడుకునే విధంగా మరో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇందుకు అనుగుణంగా బాహుబలి పంపులను వాడాలని నిర్ణయించారు. మల్లన్న సాగర్తో సాగునీటి అవసరాలు తీరుస్తూనే.. హైదరాబాద్ వాసులకు తాగునీరు అందించే విధంగా ఈ రిజర్వాయర్ ను ఉపయోగించచున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..