Smartphone: పిల్లలకు స్మార్ట్‌ ఫోన్‌ ఇస్తున్నారా.? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోందంటే..

ఓవైపు సోషల్‌ మీడియా, సైబర్‌ నేరాల ద్వారా ఆర్థికంగా నష్టపోతుంటే మరోవైపు స్మార్ట్ ఫోన్‌ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది. స్మార్ట్ ఫోన్‌ను విపరీతంగా ఉపయోగించడం వల్ల ఎన్నో నష్టాలు కలుగుతున్నట్లు నిపుణులు చెబుతూనే ఉన్నారు. మానసిక ఆరోగ్యం మొదలు శారీరక ఆరోగ్యంపై కూడా స్మార్ట్ ఫోన్‌ ప్రభావం చూపిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ జాడ్యం కేవలం పెద్దలకే పరిమితం అనుకుంటే పొరబడినట్లే...

Smartphone: పిల్లలకు స్మార్ట్‌ ఫోన్‌ ఇస్తున్నారా.? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోందంటే..
Smartpone Kids

Updated on: Sep 15, 2023 | 7:24 PM

స్మార్ట్‌ ఫోన్‌.. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తోంది. అరచేతిలో ఇమిడిపోయే ఈ వస్తువు ప్రపంచాన్నే మన ముందుకు తెస్తోంది. రైలు టికెట్‌ బుకింగ్ నుంచి బ్యాంక్‌ ఖాతా ఓపెనింగ్‌ వరకు ప్రతీ పనిని స్మార్ట్ ఫోన్‌తో చేసే రోజులు వచ్చేశాయ్‌. మనిషి జీవితంలో స్మార్ట్ ఫోన్‌ ఒక తప్పనిసరి వస్తువుగా మారిపోయింది. అయితే ఇదంతా బాగానే ఉన్నా అవసరానికి ఉపయోగపడే స్మార్ట్ ఫోన్‌ ఇప్పుడు ఒక వ్యసనంలా మారుతోంది. ఒక్క క్షణం చేతిలో ఫోన్‌ లేకపోతే ఏదో కోల్పోయిన భావన కలుగుతోంది. స్మార్ట్ ఫోన్‌తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి.

ఓవైపు సోషల్‌ మీడియా, సైబర్‌ నేరాల ద్వారా ఆర్థికంగా నష్టపోతుంటే మరోవైపు స్మార్ట్ ఫోన్‌ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోంది. స్మార్ట్ ఫోన్‌ను విపరీతంగా ఉపయోగించడం వల్ల ఎన్నో నష్టాలు కలుగుతున్నట్లు నిపుణులు చెబుతూనే ఉన్నారు. మానసిక ఆరోగ్యం మొదలు శారీరక ఆరోగ్యంపై కూడా స్మార్ట్ ఫోన్‌ ప్రభావం చూపిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ జాడ్యం కేవలం పెద్దలకే పరిమితం అనుకుంటే పొరబడినట్లే. చిన్నారులు కూడా స్మార్ట్ ఫోన్‌లకు బానిసలుగా మారుతున్నారు. 5 ఏళ్ల లోపు పిల్లలు కూడా గంటల తరబడి ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు.

తమ చిన్నారులు స్మార్ట్ ఫోన్‌ను ఆపరేట్‌ చేస్తున్నారని సంతోషించే పేరెంట్స్‌ అనారోగ్యాన్ని పంచుతున్నారని తెలుసుకోలేక పోతున్నారు. ఈ విషయం చెబుతోంది మరెవరో కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. పిల్లలు గంటల తరబడి టీవీ చూడడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. చిన్నారుల్లో మానసిక ఎదుగుదలపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు.

చిన్నతనంలో అధికంగా ఫోన్‌ చూసే పిల్లల్లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. 5ఏళ్ల లోపు చిన్నారులు రోజులో ఒక గంట కంటే ఎక్కువ ఫోన్‌ చూడకూడదని చెబుతున్నారు. పిల్లలకు స్క్రీన్‌ టైమ్‌ను వీలైనంత వరకు తగ్గించాలని చెబుతున్నారు. రేడియేషన్‌ ప్రభావం కూడా పిల్లలపై నెగిటివ్‌ ఇంపాక్ట్ చూపుతుందని చెబుతున్నారు.

స్మార్ట్ ఫోన్‌లు, ట్యాబ్‌ల నుంచి విడుదలయ్యే బ్లూ లైట్‌ వారి కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. చిన్నారుల నిద్రపై కూడా దుష్ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌కు బానిసలుగా మారి, ఎవరితో మాట్లాడకుండా ఉండే చిన్నారుల మానసిక ప్రవర్తనలోనూ భయంకరమైన మార్పులు వస్తాయని చెబుతున్నారు. పిల్లలకు ఫిజికల్‌ యాక్టివిటీని పెంచాలని, స్మార్ట్ ఫోన్‌ల వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..