
భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. దీంతో ఎండ ప్రతాపానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం వేళల్లో బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. గత మూడు రోజులుగా ఎండలు మరింత పెరిగాయి. ఎండతో పాటు తీవ్ర వడగాల్పులు, ఉక్కబోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే వేసవికాలం నేపథ్యంలో ఇళ్లల్లో ఫ్రిజ్ వాడకం పెరిగిపోయింది. అయితే హీట్ పెరిగినప్పుడు ఫ్రిజ్ ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది. దీని వల్ల కరెంట్ బిల్లు అనేది పెరుగుతూ ఉంటుంది. అంతకాకుండా ఫ్రిజ్ జీవితకాలం కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. అయితే ఫ్రిజ్ను సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా కరెంట్ బిల్లు తగ్గించుకోవచ్చు. అదెలా అనేది చూద్దాం.
చాలామంది ఫ్రిజ్ను నిండుగా నింపుతారు. కూరగాయలు కొనుగోలు చేసిన వెంటనే ఫ్రిజ్ను నింపేస్తారు. అయితే ఫ్రిజ్ నిండుగా ఉంటే చల్లటి గాలి దాని లోపల పూర్తిగా ప్రసరించదు. దీని వల్ల ఆహార పదార్థాల ధరలు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. దీంతో వస్తువుల మధ్య కొంత ఖాళీ వదలడం మంచిది. అలాగే ఫ్రిజ్ తలుపులు ఎక్కువసేపు తెరిచి ఉంచకూడదు. దీని వల్ల వేడి గాలి లోపలికి ప్రవేశించడం వల్ల చల్లబర్చడానికి విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇక వేడి ఆహారాన్ని ఫ్రిజ్లో వెంటనే పెట్టకూడదు. దీని వల్ల ఫ్రిజ్ లోపలి ఉష్ణోగ్రత పెరుగడమే కాకుండా దాని పక్కన ఉన్న ఆహారంపై కూడా ప్రభావం చూపుతుంది. దీంతో వేడి తగ్గాకనే ఆహార పదార్థాలను ఫ్రిజ్లో పెట్టాలి.
ఇక అన్నీ వస్తువులను ఒకేచోట ఉంచడం మంచిది కాదు. ఒకేచోట ఉంచడం వల్ల త్వరగా పాడవుతాయి. దీంతో పండ్లు, కూరగాయల కోసం ప్రత్యేక సొరుగులను ఉపయోగించాలి. ఇక ఫ్రిజ్ను చాలామంది గోడకు దగ్గరగా పెడతారు. దీని వల్ల మోటార్, కాయిల్స్ నుండి వచ్చే గాలి బయటకు పొదు. అందుకే ఫ్రిజ్ చుట్టూ కొద్దిపాటి ఖాళీ ఉంచాలి. ఇక ఫ్రిజ్ డోర్ పక్కన రబ్బర్ పట్టీ ఉంటుంది. ఇది చల్లని గాలి బయటకు పోకుండా చేస్తుంది. అందుకే రబ్బర్ను తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇక ఫ్రిజ్ను గరిష్ట శీతలీకరణ సెట్టింగ్లో ఉంచడం వల్ల ఎక్కువ విద్యుత్ వినియోగించబడుతుంది. కొన్నిసార్లు ఆహారం అనవసరంగా గడ్డకట్టే అవకాశం ఉంది. కాబట్టి అవసరాన్ని బట్టి మధ్యస్థ ఉష్ణోగ్రతను ఉపయోగించడం మంచిది.