Samsung: ఏఐలో దూకుడు పెంచిన సామ్‌సంగ్‌.. ఐఐటీ కాన్పూర్‌తో ఒప్పందం.

వచ్చే ఐదేళ్లలో ఈ రెండు సంస్థలు అనేక కొత్త ప్రాజెక్టులపై కలిసి పని చేయనున్నాయి. ఈ ప్రక్రియ ఐఐటీ కాన్పూర్‌లోని విద్యార్థులు తమ రంగంలో ముందుకు సాగేందుకు ఉపయోగపడుతుందని సామ్‌సంగ్‌ పేర్కొంది. అలాగే సామ్‌సంగ్‌ ఉద్యోగులు కూడా కొత్త విషయాలు నేర్చుకునే వెసులుబాటు దక్కుతుందని చెబుతున్నారు...

Samsung: ఏఐలో దూకుడు పెంచిన సామ్‌సంగ్‌.. ఐఐటీ కాన్పూర్‌తో ఒప్పందం.
Samsung

Updated on: Feb 02, 2024 | 8:59 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగంలో దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా నోయిడాలోని సామ్‌సంగ ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ అనేక రంగాలలో సంయుక్త పరిశోధనలు చేసేందుకు ఐఐటి కాన్పూర్‌తో ఒప్పందం (ఎంఒయు) కుదుర్చుకుంది. సామ్‌సంగ్‌ ఇంజనీర్లు, ఐఐటీ కాన్పూర్ విద్యార్థులు ఏఐతోపాటు క్లౌడ్ కంప్యూటింగ్, హెల్త్‌తో పాటు ఇతర ఇతర అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల్లో ప్రొఫెసర్లతో కలసి పని చేయనున్నారు.

వచ్చే ఐదేళ్లలో ఈ రెండు సంస్థలు అనేక కొత్త ప్రాజెక్టులపై కలిసి పని చేయనున్నాయి. ఈ ప్రక్రియ ఐఐటీ కాన్పూర్‌లోని విద్యార్థులు తమ రంగంలో ముందుకు సాగేందుకు ఉపయోగపడుతుందని సామ్‌సంగ్‌ పేర్కొంది. అలాగే సామ్‌సంగ్‌ ఉద్యోగులు కూడా కొత్త విషయాలు నేర్చుకునే వెసులుబాటు దక్కుతుందని చెబుతున్నారు. ఈ ఎంఓయుపై భారత్‌లోని సామ్‌సంగ్‌ ఆర్‌ అండ్‌ డి మేనేజింగ్ డైరెక్టర్‌ క్యుంగ్యున్ రూ, ఐఐటీ కాన్పూర్‌కు చెందిన పలువురు ప్రొఫెసర్ల మధ్య సంతకాలు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా IIT కాన్పూర్‌లోని విద్యార్థులు, ఉద్యోగులతో సమానంగా రీసెర్చ్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న వారికి సామ్‌సంగ్‌ ట్రైనింగ్ ఇస్తుంది.

అలాగే ఐఐటీ కాన్పూర్ విద్యార్థులకు, సామ్‌సంగ్ ఇంజనీర్లకు వివిధ రంగాలలో సర్టిఫికేట్‌లను కూడా అందిస్తుంది. ఇది IIT కాన్పూర్ విద్యార్థులు సామ్‌సంగ్‌ ఆర్‌ అండ్‌ డీ విభాగంలో ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలను పొందేందుకు కూడా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం సామ్‌సంగ్‌ భారత్‌లో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కోసం 10,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. సామ్‌సంగ్‌కు రెండు ప్రధాన పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఒకటి నోయిడాలో ఉండగా, మరొకటి బెంగళూరులో ఉంది. ఐఐటీ కాన్పూర్‌తో సామ్‌సంగ్‌ కొత్త భాగస్వామ్యం భారతదేశంలో సామ్‌సంగ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ను విస్తరించేందుకు ఉపయోగపడుతుందని కంపెనీ భావిస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..