
భారత సాయుధ దళాల చేతికి కొత్త బ్యాచ్ AK-203 అస్సాల్ట్ రైఫిల్స్ అందనున్నాయి. ఇది కలాష్నికోవ్ సిరీస్ అప్డేటెడ్ వెర్షన్. ఇది ఒక నిమిషంలో 700 రౌండ్ల వరకు కాల్పులు జరపగలదు, 800 మీటర్ల పరిధి కలిగి ఉంటుంది. ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (IRRPL) అనేది ఉత్తరప్రదేశ్లోని అమేథిలో ‘షేర్’ అని పిలువబడే AK-203 స్వదేశీ ఉత్పత్తి కోసం స్థాపించబడిన జాయింట్ వెంచర్ కంపెనీ. ఈ కంపెనీలోనే ఈ రైఫిల్స్ తయారు అవుతున్నాయి.
రూ.5,200 కోట్ల ఒప్పందం కింద ఈ కంపెనీ సాయుధ దళాలకు ఆరు లక్షలకు పైగా రైఫిళ్లను సరఫరా చేయాల్సి ఉంది. డిసెంబర్ 2030 నాటికి డెలివరీలను పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు ఐఆర్ఆర్పిఎల్ చీఫ్ మేజర్ జనరల్ ఎస్కె శర్మ గురువారం తెలిపారు. “ఇప్పటివరకు దాదాపు 48,000 రైఫిళ్లు పంపిణీ చేశాం. రాబోయే రెండు, మూడు వారాల్లో మరో 7,000 రైఫిళ్లు అందచేస్తాం. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి మరో 15,000 రైఫిళ్లు అందజేస్తాం.” అని శర్మ వెల్లడించారు.
AK-47, AK-56 రైఫిల్స్తో పోలిస్తే AK-203 రైఫిల్స్ చాలా ఆధునికమైనవి. ఇవి కలాష్నికోవ్ సిరీస్లోని అత్యంత ప్రాణాంతకమైన రైఫిల్స్లో ఒకటి. మూడు దశాబ్దాలకు పైగా సేవలందిస్తున్న ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్ (INSAS) రైఫిల్స్ స్థానంలో AK-203 రానుంది. వీటికి 7.62×39 mm కార్ట్రిడ్జ్ ఉండగా, INSAS 5.56×45 mm కార్ట్రిడ్జ్ కలిగి ఉంది.
తిరుగుబాటు నిరోధక, ఉగ్రవాద నిరోధక చర్యలలో భారత దళాల కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి రూపొందించబడిన ఈ రైఫిల్ బరువు దాదాపు 3.8 కిలోలు కాగా INSAS బరువు 4.15 కిలోలు. ‘షేర్’ రైఫిల్స్ బట్ స్టాక్ లేకుండా 705 మి.మీ పొడవు ఉంటాయి, అయితే INSAS రైఫిల్స్ 960 మి.మీ పొడవు ఉంటాయి. నియంత్రణ రేఖ, వాస్తవ నియంత్రణ రేఖతో సహా ఉత్తర, పశ్చిమ సరిహద్దుల వెంబడి మోహరించిన సైనికులకు ఇవి ప్రాథమిక అస్సాల్ట్ రైఫిల్గా మారతాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి