ఓరి నాయనో.. 5.3 సెకన్లలో 800 కిమీ వేగం! చైనా రైలు సరికొత్త రికార్డు!

చైనాలోని ప్రయోగాత్మక మాగ్లెవ్ రైలు కేవలం 5.3 సెకన్లలో గంటకు 800 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. హుబేలోని డాంగ్‌హు ప్రయోగశాలలో ఈ పరీక్ష నిర్వహించారు. ప్రయాణికుల కోసం కాకుండా, రాకెట్రీ, ఏరోస్పేస్, హైస్పీడ్ రవాణా సాంకేతికతల కోసం ఈ వాహనాన్ని అభివృద్ధి చేస్తున్నారు.

ఓరి నాయనో.. 5.3 సెకన్లలో 800 కిమీ వేగం! చైనా రైలు సరికొత్త రికార్డు!
China Maglev Train 800 Kmph

Updated on: Aug 14, 2026 | 1:39 PM

చైనా మరోసారి హైస్పీడ్ టెక్నాలజీలో సంచలనం సృష్టించింది. అక్కడి పరిశోధకులు అభివృద్ధి చేస్తున్న ప్రయోగాత్మక మాగ్లెవ్ రైలు కేవలం 5.3 సెకన్లలో గంటకు 800 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఆరు నెలల వ్యవధిలో ఇదే వాహనం తన స్వల్ప-దూర యాక్సిలరేషన్ మూడోసారి అధిగమించడం విశేషం. పలు నివేదికల ప్రకారం.. సుమారు 1.1 టన్నుల బరువున్న ఈ ప్రయోగాత్మక వాహనాన్ని హుబే ప్రావిన్స్‌లోని డాంగ్‌హు ప్రయోగశాలలో 1 కిలోమీటరు పొడవైన ప్రత్యేక ట్రాక్‌పై పరీక్షించారు. అయితే ఇది సాధారణ ప్రయాణికులను తరలించేందుకు రూపొందించిన రైలు కాదు. భవిష్యత్తులో రాకెట్రీ, ఏరోస్పేస్, హైస్పీడ్ రవాణా వంటి రంగాల్లో ఉపయోగపడే సాంకేతికతలను పరీక్షించడమే దీని ప్రధాన ఉద్దేశం.

మాగ్లెవ్ టెక్నాలజీలో అయస్కాంత శక్తిని ఉపయోగించి రైలును పట్టాలపై నుంచి కొద్దిగా పైకి లేపుతారు. దీంతో చక్రాలు, పట్టాల మధ్య ఉండే ఘర్షణ గణనీయంగా తగ్గుతుంది. అనంతరం పట్టాల వెంట ఏర్పాటు చేసిన విద్యుదయస్కాంత కాయిల్స్ సృష్టించే అయస్కాంత క్షేత్రాల ద్వారా వాహనాన్ని ముందుకు నడిపిస్తారు. తాజా పరీక్షలో వాహనం కేవలం 5.3 సెకన్లలో గంటకు 800 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంది. అనంతరం సుమారు 200 మీటర్ల దూరం ప్రయాణించి నియంత్రిత విధానంలో ఆపారు. ఇంతటి వేగాన్ని సాధించడంతో పాటు సురక్షితంగా బ్రేకింగ్ చేయడం కూడా ఈ ప్రయోగంలో కీలక విజయంగా పరిశోధకులు భావిస్తున్నారు.

ఇదే వాహనం 2025 జూన్‌లో తొలిసారిగా 7 సెకన్లలో గంటకు సుమారు 650 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ఆ తర్వాత వేగాన్ని దాదాపు 700 కిలోమీటర్లకు, అనంతరం 798 కిలోమీటర్లకు పెంచారు. అదే సమయంలో గరిష్ఠ వేగాన్ని చేరుకునే సమయాన్ని కూడా క్రమంగా తగ్గించారు. చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ CCTV ప్రకారం.. అధిక శక్తి విద్యుత్ సరఫరా, విద్యుదయస్కాంత ప్రొపల్షన్, హైస్పీడ్ లెవిటేషన్ కంట్రోల్, అత్యవసర బ్రేకింగ్ వంటి కీలక సాంకేతికతలను ప్రతి దశలో పరీక్షిస్తున్నారు.

ప్రస్తుతం వాణిజ్య మాగ్లెవ్ రైళ్లు సాధారణంగా గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడుస్తుండగా, చైనాలోని అత్యంత వేగవంతమైన హైస్పీడ్ రైళ్లు సుమారు 350 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. ఈ నేపథ్యంలో ప్రయోగాత్మక వాహనం సాధించిన 800 కిలోమీటర్ల వేగం భారీ ముందడుగుగా నిలిచింది. అయితే ఈ టెక్నాలజీ ప్రయాణికుల రవాణాకు అందుబాటులోకి రావడానికి ఇంకా అనేక సవాళ్లు ఉన్నాయి. అత్యంత ఖచ్చితత్వంతో పొడవైన ట్రాక్‌ల నిర్మాణం, మౌలిక సదుపాయాల వ్యయం, స్థిరత్వం, అత్యవసర బ్రేకింగ్, ప్రయాణికుల భద్రత వంటి అంశాలను పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ రైలు ప్రధానంగా భవిష్యత్తు హైస్పీడ్ వ్యవస్థలకు ప్రయోగశాలగా పనిచేస్తోంది.

మరన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us