ప్రపంచం గర్వించదగ్గ భారతీయ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్కు భారతరత్న ఇవ్వకపోవడం మరోసారి వార్తల్లో నిలిచింది. మేజర్ ధ్యాన్చంద్ హాకీలో అసాధరమైన ప్రతిభను చూపి భారతీయ కీర్తిని యావత్ ప్రపంచానికి తెలిసేలా చేశారు. 1926 నుంచి 1949 వరకు హాకీ క్రీడకు ఆయన కెప్టెన్గా కొనసాగారు. ఈయన ప్రతిభావంతమైన ఆటతీరుతో ఒలింపిక్స్ మూడు సార్లు బంగారు పతకాన్ని సాధించారు. 1928,1932 మరియు 1936 సంవత్సరాల్లో జరిగిన ఒలింపిక్స్లో ఆయన బంగారు పతకాల్ని సాధించారు. హాకీ క్రీడలో ఆయన అపారమైన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 1956లో పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది. భారత్ కీర్తిని విశ్వవ్యాపితం చేసిన ధ్యాన్చంద్ విషయంలో భారత ప్రభుత్వం భారతరత్నను ప్రకటించడంలో మాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఇదే విషయంపై ధ్యాన్చంద్ కుమారుడు అశోక్ కుమార్ ఓ జాతీయ మీడియా సంస్ధతో మాట్లాడుతూ తన తండ్రికి భారతరత్న ఇవ్వడం ఇవ్వకపోవడం వల్ల తమకు కలిగే ప్రయోజనం ఏమీ లేదని, కానీ ధ్యాన్చంద్ ఆ అవార్డుకు అర్హుడా కాదా అనేది ప్రభుత్వమే చెప్పాలన్నారు. క్రీడాకారులు అవార్డులు కోరుకోరు..వాటికోసం వేడుకోరు అంటూ అశోక్ కుమార్ వ్యాఖ్యానించారు. గతంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ భారతరత్న ఫైల్పై సంతకం కూడా చేశారని, ఆ తర్వాత ధ్యాన్చంద్ను భారతరత్న బిరుదు ప్రదానం చేస్తామని అప్పటి క్రీడల మంత్రి కూడా తమకు తెలిపారన్నారు అశోక్ కుమార్. అయితే ఈ నిర్ణయం తర్వాత వాయిదా పడిందన్నారు.
ఇలా చేయడం వల్ల ప్రభుత్వం మమ్మల్ని అవమానించినట్టు కాదు. ఖచ్చితంగా జాతీయ చిహ్నాన్ని అవమానించినట్టే అన్నారు అశోక్ కుమార్.