వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భారత్లో జరిగే ఐపీఎల్ తరహాలో..వెస్టిండీస్లో ఏటా జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టీ20 టోర్నీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు గేల్ స్పష్టం చేసాడు. వ్యక్తిగత కారణాలతోనే తాను ఈ ఏడాది సీపీఎల్ 2020లో ఆడట్లేదని గేల్ ప్రకటించాడు. ఈ ఏడాది గేల్ సెయింట్ లూసియా జూక్స్ ప్రాంచైజీ తరఫున ఆడనున్నట్లు గత ఏప్రిల్లో క్రిస్ గేల్ ఒప్పందం చేశాడు. అయితే, ప్రస్తుత కరోనా, లాక్డౌన్ కారణంగా క్రిస్ గేల్ జమైకాలో ఉన్నాడు. అతని కుటుంబం మాత్రం సెయింట్ కిట్స్ ప్రాంతంలో ఉంది. దీంతో గేల్ అతని భార్య, పిల్లలను కలవలేకపోయాడు. కుటుంబంతో గడపడానికి తనకు సమయం కావాలని ఈ మెయిల్లో రాసుకొచ్చాడు.
ఇదిలా ఉంటే, జమైకా తలైవాస్ తరఫున గత ఏడాది ఆడిన క్రిస్ గేల్.. పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. దాంతో సీపీఎల్ 2020 సీజన్ కోసం క్రిస్ గేల్ను తలైవాస్ జట్టు అట్టిపెట్టుకోలేదు. అలా తలైవాస్ ఫ్రాంఛైజీ తనని వదిలేయడానికి కారణం ఆ జట్టు సహాయ కోచ్ శర్వాన్ మాటలేనని క్రిస్గేల్ ఇటీవల ఆరోపించాడు. గేల్ విమర్శలపై జమైకా తలైవాస్ ఫ్రాంఛైజీ ఘాటుగా స్పందించింది. ప్రదర్శన బాగా లేదు కాబట్టే వేలంలోకి వదిలిపెట్టామని క్రిస్గేల్కి స్పష్టం చేసిన ఫ్రాంఛైజీ.. ఆటగాడి విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు మాకుందని చురకలేసింది.
మొత్తంగా క్రిస్గేల్కి ఫ్రాంఛైజీ ఇచ్చిన రిప్లై ఓ అవమానంలా అనిపించినట్లుంది. అందుకే సీపీఎల్ 2020 సీజన్కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 2013 నుంచి ఈ టోర్నీ జరుగుతుండగా.. క్రిస్గేల్ 2,344 పరుగులతో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. అయితే, సీపీఎల్ టోర్నీ కోసం ఈ ఏడాది ఆటగాళ్ల ‘డ్రాఫ్ట్’కు ఒక రోజు ముందు యూనివర్సల్ బాస్ తప్పుకోవడం విశేషం.