
Richa Ghosh : భారత మహిళల జట్టుకు ప్రపంచకప్ అందించడంలో కీలకపాత్ర పోషించిన బెంగాల్ క్రికెటర్ రిచా ఘోష్ ను శనివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఘనంగా సత్కరించారు. రిచా ఘోష్ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం డీఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వు ఇచ్చింది. అంతేకాక, బంగా భూషణ్ అవార్డు, గోల్డ్ చైన్, భారీ నగదు బహుమతిని కూడా అందించింది. ఈ వేడుకను నిర్వహించిన క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ వరల్డ్ కప్ ఫైనల్లో రిచా చేసిన ప్రతి పరుగుకూ రూ.లక్ష చొప్పున మొత్తం రూ. 34 లక్షల భారీ రివార్డును ప్రకటించింది.
ప్రపంచకప్ విజయం సాధించిన బెంగాల్కు చెందిన తొలి క్రికెటర్గా రిచా ఘోష్ ఘనత సాధించింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఈడెన్ గార్డెన్స్లో అద్భుతమైన సన్మాన కార్యక్రమం జరిగింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రిచా ఘోష్కు బంగా భూషణ్ మెడల్, డీఎస్పీ అపాయింట్మెంట్ లెటర్, గోల్డ్ చైన్ బహుకరించారు.
క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రిచా ఘోష్కు ప్రత్యేకంగా రూ. 34 లక్షల నగదు బహుమతిని అందజేశారు. ఈ డబ్బును వరల్డ్ కప్ ఫైనల్లో ఆమె చేసిన ప్రతి పరుగుకు (34 పరుగులు) రూ. లక్ష చొప్పున లెక్కించి ఇచ్చారు. రిచా ఘోష్ భారత జట్టు వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది.
🚨 RICHA GHOSH FELICIATED WITH 34 LAKHS & DSP RANK IN WEST BENGAL POLICE FOR WINNING WORLD CUP FOR INDIA 🚨
– Richa Ghosh, The Star! 🌟 pic.twitter.com/mQ2q7aup6Q
— Tanuj (@ImTanujSingh) November 8, 2025
సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో రిచా ఘోష్ నంబర్-7 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 24 బంతుల్లో 34 పరుగులు (3 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసింది. ఆమె చేసిన ఈ కీలకమైన పరుగులు భారత జట్టు స్కోరును 298/7కు చేర్చడానికి సహాయపడింది. దీనికి సమాధానంగా దక్షిణాఫ్రికా 246 పరుగులకే ఆలౌట్ అయింది. టోర్నమెంట్ మొత్తంలో రిచా 8 ఇన్నింగ్స్లలో 39.16 సగటుతో 235 పరుగులు చేసింది. ఆమె 133.52 స్ట్రైక్ రేట్ను కలిగి ఉంది. ఇది భారతీయ బ్యాటర్లలో అత్యధికం. అంతేకాక, ఒకే ఉమెన్స్ వరల్డ్ కప్లో అత్యధికంగా 12 సిక్సర్లు కొట్టి డియాండ్రా డాటిన్ రికార్డును సమం చేసింది.
సౌరవ్ గంగూలీ రిచా ఘోష్ను బెంగాల్ రాష్ట్రానికే గర్వకారణంగా అభివర్ణించారు. “రిచా మన రాష్ట్రానికి గర్వకారణం. ఆమె తన మంచి ప్రదర్శనను కొనసాగించాలని ఆశిస్తున్నాను. ఆమె ఒక రోజు భారత మహిళల జట్టుకు కెప్టెన్గా అవుతుందని నేను నమ్ముతున్నాను” అని గంగూలీ అన్నారు. ‘బంగా భూషణ్’ అనేది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పౌర గౌరవాలలో ఒకటి. దీనిని కళ, సంస్కృతి, సాహిత్యం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అందిస్తారు. ఒక ఫినిషర్గా తన మానసిక వైఖరిని వివరిస్తూ.. “నేను ఒత్తిడిని ఆస్వాదిస్తాను. నెట్స్లో బ్యాటింగ్ చేసేటప్పుడు, నేను సమయాన్ని చూసుకుంటూ ఆ నిర్దిష్ట సమయంలో ఎన్ని పరుగులు చేయగలను అని చూస్తాను” అని రిచా తెలిపింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..