
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ క్రికెట్ లీగ్. వరల్డ్స్ రిచెస్ట్ క్రికెట్ బోర్డ్ బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి క్రికెటర్ ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకోవాలని తహతహలాడిపోతంటాడు. కొంతమంది అయితే వాళ్ల దేశం తరఫున మ్యాచ్లు ఎగ్గొట్టి, ఐపీఎల్లో ఆడుతుంటారు. ఐపీఎల్లో కురిసే కాసుల వర్షమే అందుకు కారణం. ఐపీఎల్ను చూసి ప్రపంచ వ్యాప్తంగా చాలా లీగులే పుట్టుకొచ్చాయి. కరేబియన్ ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషనల్ లీగ్ టీ20, ది హండ్రెడ్.. ఇలా ఎన్ని లీగులు వచ్చినా.. ఐపీఎల్కు వచ్చిన క్రేజ్ వాటికి రాలేదు. ఐపీఎల్లో ఆటగాళ్లకు వచ్చేంత డబ్బు కూడా ఆయా లీగ్స్లో ఆడే ప్లేయర్లకు రాదు. అందుకే చాలా మంది ఐపీఎల్ లో ఆడేందుకు ఇష్టపడుతుంటారు. బీసీసీఐ, క్రికెట్ను అమితంగా ప్రేమించే పెద్ద దేశం ఇండియా, ఇంకా భారత క్రికెటర్లు, ఫ్రాంచైజీలు. ఈ నాలుగు ఫ్యాక్టర్లు ఐపీఎల్ సక్సెస్కు కారణం.
ఐపీఎల్లో సూపర్ సక్సెస్ అయిన ఫ్రాంచైజీలు పైన చెప్పుకున్న కొన్ని లీగ్స్లో కూడా పెట్టుబడులు పెట్టాయి. సౌతాఫ్రికా టీ20 లీగ్లో అయితే మన ఫ్రాంచైజీలే ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లండ్ వేదికగా జరిగే ది హండ్రెడ్ లీగ్లో కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలు పెట్టుబడులు పెడుతున్నాయి. ముంబై ఇండియన్స్ టీమ్ ఫ్రాంచైజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ – ఓవల్ ఇన్విన్సిబుల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఫ్రాంచైజీ GMR గ్రూప్ – సదరన్ బ్రేవ్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఫ్రాంచైజీ సంజీవ్ గోయెంకాకు చెందిన RPSG – మాంచెస్టర్ ఒరిజినల్స్, మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఫ్రాంచైజీ సన్ టీవీ నెట్వర్క్ – నార్తర్న్ సూపర్చార్జర్స్ జట్లలో వాటాలు కొనుగోలు చేశాయి.
ది హండ్రెడ్ లీగ్ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈసీబీ(ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు) ఐపీఎల్ ఫ్రాంచైజీల పెట్టుబడులను ఆహ్వానించింది. ది హండ్రెడ్ లీగ్లోని నాలుగు టీమ్స్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు వాటలు కొనుగోలు చేయడంపై ఈసీబీ హ్యాపీగా ఉన్నా, పాకిస్థాన్ ఆటగాళ్లు మాత్రం భయపడుతున్నారు. అదేంటి ఐపీఎల్ టీమ్స్ ఇంగ్లండ్లోని ది హండ్రెడ్ లీగ్లో పెట్టుబడులు పెడితే వాళ్లేందుకు భయపడుతున్నారు? అని డౌట్ వస్తుందా? అందుకు ఓ కారణం ఉంది. అదేంటంటే.. ఐపీఎల్లో ఆడేందుకు పాకిస్థాన్ ఆటగాళ్లకు అవకాశం లేదనే విషయం తెలిసిందే. ఐపీఎల్ ఆరంభ సీజన్లో పాక్ ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడినా.. ముంబైలో ఉగ్రదాడి తర్వాత పాక్ ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడటాన్ని నిషేధించారు. అలాగే టీమిండియా కూడా పాకిస్థాన్కు వెళ్లడం లేదు.
సౌతాఫ్రికాలో జరిగే ఎస్ఏ20 లీగ్లో కూడా పాకిస్థాన్ ఆటగాళ్లకు ఆడే అవకాశం లేదు. ఎందుకంటే.. ఎస్ఏ20 లీగ్లో అన్ని టీమ్స్ కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలే దక్కించుకున్నాయి. సో.. ఆ లీగ్లో పాల్గొనేందుకు పాక్ ఆటగాళ్లకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు ది హండ్రెడ్ లీగ్లోని నాలుగు టీమ్స్లో కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలు పెట్టుబడులు పెట్టడంతో తమను ది హండ్రెడ్లో కూడా ఆడకుండా నిషేధిస్తారేమో అని పాకిస్థాన్ క్రికెటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వారికి అభయం ఇచ్చింది. మీరేం కంగారు పడకండి. ది హండ్రెడ్లో అలాంటి పరిస్థితి ఏం ఉండదని ప్రకటించింది. అంటే.. ది హండ్రెడ్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు పెట్టుబడులు పెట్టినా పాక్ ప్లేయర్లు అందులో ఆడతారని ఈసీబీ వెల్లడించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..