
IPL in Australia: భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుల మధ్య సరికొత్త మైత్రి సరిహద్దులు దాటుతోంది. చరిత్రలోనే తొలిసారి బిగ్ బాష్ లీగ్ (BBL) మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుండగా.. దీనికి ప్రతిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్లను ఆస్ట్రేలియాలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే కంగారూల గడ్డపై ఆడేందుకు ఏ ఐపీఎల్ జట్లు సరిగ్గా సరిపోతాయో ప్రత్యేక విశ్లేషణ మీకోసం.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించిన చారిత్రాత్మక నిర్ణయంతో ఇరు దేశాల క్రికెట్ బంధం మరో మైలురాయిని తాకింది. ఈ ఏడాది డిసెంబర్ 12న చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా మెల్బోర్న్ రెనెగేడ్స్, పెర్త్ స్కార్చర్స్ మధ్య బిగ్ బాష్ లీగ్ (BBL 2026/27) ప్రారంభ మ్యాచ్ జరగనుంది. ఒక విదేశీ టీ20 లీగ్ భారత్లో మ్యాచ్ నిర్వహించడం ఇదే తొలిసారి. భారతీయ మార్కెట్ను, ఇక్కడి క్రికెట్ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) ఈ భారీ వ్యూహాన్ని రచించింది.
‘ది ఏజ్’ పత్రిక కథనం ప్రకారం, బిగ్ బాష్ లీగ్కు భారత్ ఆతిథ్యమిస్తున్నందున.. భవిష్యత్తులో ఐపీఎల్ మ్యాచ్లను ఆస్ట్రేలియాలోని పెర్త్ లేదా మెల్బోర్న్ మైదానాల్లో నిర్వహించేలా బీసీసీఐతో చర్చలు జరపాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. అదే కనుక జరిగితే, ఆస్ట్రేలియాలోని వేగవంతమైన, బౌన్సీ పిచ్లపై ఏ ఐపీఎల్ జట్లు తలపడితే బాగుంటుందనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.
ఆస్ట్రేలియా పిచ్లు అనగానే మనకు గుర్తొచ్చేది విపరీతమైన బౌన్స్, పేస్. భారత పిచ్లలో ముంబైలోని వాంఖెడే, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మాత్రమే ఆసీస్ పిచ్లను పోలి ఉంటాయి. కాబట్టి ఆస్ట్రేలియా వాతావరణానికి, అక్కడి కండిషన్స్కు ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI), మూడుసార్లు విజేత కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు అత్యంత అనుకూలంగా ఉంటాయి.
ఒకవేళ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే.. ముంబై పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, కార్బిన్ బాష్ ఒకవైపు.. కేకేఆర్ సంచలనాలు హర్షిత్ రాణా, కార్తీక్ త్యాగి, మతీశ పతిరణల మధ్య జరిగే పేస్ యుద్ధం అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేయడం ఖాయం.
దాదాపు $18.5 బిలియన్ల బ్రాండ్ వాల్యూతో ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్గా ఎదిగిన ఐపీఎల్లో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న జట్లు చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB). బిగ్ బాష్ మ్యాచ్ చెన్నైలో జరుగుతున్నందున, దానికి బదులుగా సీఎస్కే జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లడం సమంజసంగా ఉంటుంది. పైగా గత రెండేళ్లుగా వరుసగా ట్రోఫీలు గెలుచుకుంటూ ఆర్సీబీ సృష్టిస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.
ఆస్ట్రేలియాలోని ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో ఎంఎస్ ధోనీ వర్సెస్ విరాట్ కోహ్లీ తలపడితే, ఆ మ్యాచ్ సృష్టించే మార్కెటింగ్ రికార్డులు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోతాయి. లక్షలాది మంది ప్రవాస భారతీయులు మైదానానికి పోటెత్తడం ఖాయం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..