Ind vs Eng : వాంఖడే పిచ్ రిపోర్ట్.. క్యూరేటర్‌తో గంభీర్ వాగ్వాదం.. సెమీస్‌కు ముందు టెన్షన్ టెన్షన్

Ind vs Eng : ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియం నేడు (మార్చి 5) టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్‌కు ఆతిథ్యమిస్తోంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న ఈ హై వోల్టేజ్ పోరుకు ముందు పిచ్ రిపోర్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Ind vs Eng : వాంఖడే పిచ్ రిపోర్ట్.. క్యూరేటర్‌తో గంభీర్ వాగ్వాదం.. సెమీస్‌కు ముందు టెన్షన్ టెన్షన్
Ind Vs Eng Semifinal Pitch Report

Updated on: Mar 05, 2026 | 11:21 AM

Ind vs Eng : ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియం నేడు (మార్చి 5) టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్‌కు ఆతిథ్యమిస్తోంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న ఈ హై వోల్టేజ్ పోరుకు ముందు పిచ్ రిపోర్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా వాంఖడే పిచ్ బ్యాటర్లకు స్వర్గధామంలా ఉంటుంది, కానీ ఈసారి బయటకు వచ్చిన పిచ్ దృశ్యాలు టీమిండియా మేనేజ్‌మెంట్‌ను కాస్త కలవరపెడుతున్నాయి. పిచ్‌పై స్పష్టంగా కనిపిస్తున్న పచ్చని గడ్డి, పేస్ బౌలర్లకు వరంగా మారేలా కనిపిస్తోంది.

పిచ్ కండిషన్స్ చూసిన భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, పిచ్ క్యూరేటర్‌తో తీవ్రంగా చర్చించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ సమయంలో గంభీర్ క్యూరేటర్‌తో చాలా సీరియస్‌గా మాట్లాడటం, అసంతృప్తి వ్యక్తం చేయడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిచ్‌పై గడ్డి ఉండటం వల్ల బంతి అనూహ్యంగా స్వింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే ఇంగ్లాండ్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, మార్క్ ఉడ్ వంటి వారు భారత టాప్ ఆర్డర్‌ను ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది.

వాంఖడే స్టేడియం చరిత్రను పరిశీలిస్తే, ఇక్కడ ఛేజింగ్ చేయడం సులభమని పేరుంది. కానీ ఈ గడ్డి పిచ్ కనుక మారకపోతే, టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుని ప్రత్యర్థిని దెబ్బకొట్టాలని చూస్తుంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఐపీఎల్ వల్ల ఇక్కడి పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. ఒకవేళ పిచ్ పేసర్లకు అనుకూలిస్తే, ఇంగ్లాండ్ బౌలింగ్ అటాక్ భారత్‌కు కఠిన సవాల్ విసరడం ఖాయం. మరోవైపు భారత్ కూడా జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లపై భారీ ఆశలు పెట్టుకుంది.

ఈ పిచ్ వివాదంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సొంత గడ్డపై జరుగుతున్న మ్యాచ్‌లో మనకు అనుకూలమైన స్పిన్ పిచ్ కాకుండా, పేస్ ఫ్రెండ్లీ పిచ్‌ను సిద్ధం చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తుంటే, అసలైన పోరు పిచ్‌తో సంబంధం లేకుండా ఆటగాళ్ల ప్రతిభపైనే ఆధారపడి ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, గంభీర్ ఆందోళన చూస్తుంటే మ్యాచ్ గమనాన్ని పిచ్ శాసించబోతోందని స్పష్టమవుతోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us