IND vs SL: 5 ఇన్నింగ్స్‌లు.. 610 పరుగులు.. 3 సెంచరీలు.. కోహ్లీ 9 ఏళ్ల నాటి రికార్డు బద్దలవుతుందా?

IND vs SL: శ్రీలంకతో 2017 టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ 5 ఇన్నింగ్స్‌ల్లో 610 పరుగులు చేసి అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈసారి రెండు టెస్టుల్లో గిల్, జైస్వాల్, రాహుల్ ఆ రికార్డును బద్దలు కొట్టగలరా? 9 ఏళ్ల తర్వాత జరగనున్న సిరీస్‌లో ఆసక్తి పెరిగింది.

IND vs SL: 5 ఇన్నింగ్స్‌లు.. 610 పరుగులు.. 3 సెంచరీలు.. కోహ్లీ 9 ఏళ్ల నాటి రికార్డు బద్దలవుతుందా?
Virat Kohli

Updated on: Aug 11, 2026 | 4:09 PM

IND vs SL: భారత్, శ్రీలంక మధ్య సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ టెస్టు పోరు మొదలుకాబోతోంది. ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా, టీమిండియా దాదాపు 9 సంవత్సరాల తర్వాత ఒక టెస్టు సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్తోంది. గత తొమ్మిదేళ్లలో భారత జట్టు స్వరూపమే మారిపోయినప్పటికీ, 2017లో జరిగిన టెస్టు సిరీస్ మాత్రం భారత క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా విరాట్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది. ఆ సిరీస్‌లో విరాట్ కోహ్లీ సాధించిన రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది.

విరాట్ కోహ్లీ 9 ఏళ్ల నాటి రికార్డు

2017-18లో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్‌తో విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 5 ఇన్నింగ్స్‌ల్లోనే ఏకంగా 610 రన్స్ సాధించి రికార్డు సృష్టించాడు. ఆ సిరీస్‌లో కోహ్లీ 3 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ సాధించి పరుగుల వరద పారించాడు. ఆ సమయంలో కోహ్లీ 1997 సిరీస్‌లో 571 రన్స్ చేసి రికార్డు నెలకొల్పిన లంక దిగ్గజం సనత్ జయసూర్య 20 ఏళ్ల నాటి రికార్డును తుడిచిపెట్టేశాడు. అంతేకాకుండా ఒకే సిరీస్‌లో అత్యధికంగా 3 సెంచరీలు చేసిన అరవింద డిసిల్వా రికార్డును కూడా కోహ్లీ సమం చేశాడు.

ఈ సిరీస్‌లో రికార్డు బద్దలవడం సాధ్యమేనా?

రాబోయే భారత్-శ్రీలంక టెస్టు సిరీస్‌లో కేవలం 2 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే జరగనున్నాయి. అంటే ఒక బ్యాటర్‌కు గరిష్టంగా లభించేది 4 ఇన్నింగ్స్‌లు మాత్రమే. అంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ సాధించిన 610 పరుగుల భారీ లక్ష్యాన్ని అధిగమించడం ఏ ఆటగాడికీ సులభమైన విషయం కాదు. అయితే టీమిండియా యువ సంచలనాలు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఫామ్‌లో ఉన్నందున వారిపై అందరి దృష్టి నెలకొంది. భారత్-శ్రీలంక సిరీస్‌లో అత్యధిక రన్స్ చేసిన జాబితాలో కోహ్లీ (610) అగ్రస్థానంలో ఉండగా, జయసూర్య (571), సెహ్వాగ్ (491), సంగక్కర (467), రాహుల్ ద్రవిడ్ (433) తరువాతి స్థానాల్లో ఉన్నారు.

యాక్టివ్ ప్లేయర్లు, మ్యాచ్ షెడ్యూల్

ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్ల విషయానికి వస్తే, శ్రీలంక తరఫున దినేష్ చండిమాల్ 6 ఇన్నింగ్స్‌ల్లో 288 పరుగులతో ముందుండగా, భారత ఆటగాళ్లలో రవీంద్ర జడేజా 3 ఇన్నింగ్స్‌ల్లో ఒక సెంచరీతో 202 రన్స్ చేసి టాప్‌లో ఉన్నాడు. ఇరు జట్ల మధ్య మొదటి టెస్ట్ ఆగస్టు 15 నుంచి గాల్‌ వేదికగా జరగనుండగా, రెండో టెస్ట్ ఆగస్టు 23 నుంచి కొలంబోలో జరగనుంది. కాగా గడిచిన 18 సంవత్సరాలుగా శ్రీలంక జట్టు భారత్‌పై ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేకపోవడం గమనార్హం.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us