
దేశవాళీ క్రికెట్ అభిమానులకు ఒక నిరాశ కలిగించే వార్త. విజయ్ హజారే ట్రోఫీ 2025లో తమ తమ రాష్ట్ర జట్ల తరపున ఆడుతున్న టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 4వ రౌండ్ మ్యాచ్లకు దూరం కానున్నారు. ఢిల్లీ తరపున కోహ్లీ, ముంబై తరపున రోహిత్ ఈ టోర్నీలో సందడి చేసినప్పటికీ, ఇప్పుడు వారు మైదానంలో కనిపించకపోవడానికి గల కారణాలను ఓసారి చూద్దాం..
చాలా కాలం తర్వాత విరాట్ కోహ్లీ (ఢిల్లీ), రోహిత్ శర్మ (ముంబై) దేశవాళీ వన్డే టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. విరాట్ కోహ్లీ వరుసగా రెండు ఇన్నింగ్స్లలో అద్భుతమైన ఫామ్ను కనబరిచి 131, 77 పరుగులు చేయగా, రోహిత్ శర్మ కూడా తనదైన శైలిలో మెరుపులు మెరిపించారు. వీరిద్దరి రాకతో స్టేడియాలు అభిమానులతో నిండిపోయాయి. 4వ రౌండ్కు ఎందుకు దూరం? నేడు జరగనున్న 4వ రౌండ్ మ్యాచ్ల్లో విరాట్, రోహిత్ ఆడటం లేదు. దీనికి ప్రధానంగా వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణమని తెలుస్తోంది.
జనవరి 11, 2026 నుంచి న్యూజిలాండ్తో కీలకమైన మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ అంతర్జాతీయ మ్యాచ్ల కోసం సిద్ధమవ్వడానికి, తగినంత విశ్రాంతి తీసుకోవడానికి వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ అంతర్జాతీయ షెడ్యూల్ తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడిన వీరు, న్యూజిలాండ్ సిరీస్ ప్రారంభానికి ముందు తమ కుటుంబాలతో గడపడానికి, శారీరక దృఢత్వంపై దృష్టి సారించడానికి కొద్దిరోజుల విరామం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం.
సీనియర్ ఆటగాళ్లు ఐపీఎల్, ఐసీసీ ఈవెంట్లకు ముందు గాయాల బారిన పడకుండా చూడటం బీసీసీఐకి అత్యంత ముఖ్యం. అందుకే, ఇప్పటికే ఫామ్లోకి వచ్చిన రోహిత్, కోహ్లీలు దేశవాళీ టోర్నీలో అన్ని మ్యాచ్లు ఆడాల్సిన అవసరం లేదని మేనేజ్మెంట్ భావిస్తోంది. అయితే, నాకౌట్ మ్యాచ్ల సమయానికి వారు తిరిగి జట్టుతో చేరే అవకాశం లేకపోలేదు. ఢిల్లీ, ముంబై జట్లు ప్రస్తుతం గ్రూప్ టేబుల్లో మంచి స్థానాల్లోనే ఉన్నాయి. కోహ్లీ స్థానంలో ఢిల్లీకి రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తుండగా, రోహిత్ గైర్హాజరీలో ముంబై బ్యాటింగ్ భారాన్ని సర్ఫరాజ్ ఖాన్, అంగ్రిష్ రఘువంశీ వంటి యువ ఆటగాళ్లు మోయనున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..