
దంబుల్లాలో జరుగుతున్న ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయి వేదికపై తన ప్రతిభను మరోసారి చాటుకుంటూ శ్రీలంక ఏ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన వైభవ్ కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి మ్యాచ్ను ఏకపక్షంగా మార్చేశాడు. సెంచరీకి కేవలం ఆరు పరుగుల దూరంలో ఉండగా శ్రీలంక ఏ కెప్టెన్ సహాన్ బౌలింగ్లో అవుటయ్యాడు.
వైభవ్ తన దూకుడు ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు బాదాడు. ముఖ్యంగా శ్రీలంక బౌలర్ మొహమ్మద్ షిరాజ్ వేసిన ఒకే ఓవర్లో 26 పరుగులు రాబట్టాడు. వైభవ్ అవుటైన తర్వాత మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య 39 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు. అతడిని దులజ్ సముడిత ఔట్ చేశాడు. అనంతరం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ క్రీజులో నిలిచి భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించారు. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ సహాన్ అరచ్చిగే తొలుత బౌలింగ్ ఎంచుకున్నప్పటికీ, వైభవ్ విధ్వంసకర బ్యాటింగ్ ముందు ఆ వ్యూహం ఫలించలేదు.
THE VAIBHAV SOORYAVANSHI SHOW IN THE FINAL. pic.twitter.com/LiuSZ5M69C
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 21, 2026
ఇటీవలి మ్యాచ్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన వైభవ్ సూర్యవంశీ, ఫైనల్ వంటి కీలక మ్యాచ్లో ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడి తన ప్రతిభను మరోసారి నిరూపించాడు. సెంచరీ మిస్ అయినప్పటికీ, అతని 94 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్లో చిరస్మరణీయంగా నిలిచే అవకాశం ఉంది. పైగా ఈ మ్యాచ్ కంటే ముందు శ్రీలంక ఆటగాళ్లతో వైభవ్ గొడవ కూడా బాగా వివాదాస్పదమైంది. ఆ గొడవ తర్వాత వైభవ్ ఇలా రెచ్చిపోవడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.