Vaibhav Sooryavanshi : చదువు, సంస్కారం లేదు.. పక్కా పల్లెటూరోడు.. వైభవ్ పై నోరు పారేసుకున్న లంక మేనేజర్

Vaibhav Sooryavanshi : ఇండియా-ఏ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ శ్రీలంక-ఏ మ్యాచ్ అనంతరం వివాదంలో చిక్కుకున్నాడు. మైదానంలో తోపులాట తర్వాత శ్రీలంక మాజీ మేనేజర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వైభవ్ సూర్యవంశీ ప్రత్యర్థిని నెట్టేయడంపై, లంక మాజీ మేనేజర్ పల్లెటూరి కుర్రాడు అంటూ వ్యాఖ్యానించాడు.

Vaibhav Sooryavanshi : చదువు, సంస్కారం లేదు.. పక్కా పల్లెటూరోడు.. వైభవ్ పై నోరు పారేసుకున్న లంక మేనేజర్
Vaibhav Sooryavanshi (1)

Updated on: Jun 16, 2026 | 7:05 AM

Vaibhav Sooryavanshi :  క్రికెట్ మైదానంలో ఆటగాళ్ల మధ్య గొడవలు, స్లెడ్జింగ్ సహజమే అయినప్పటికీ ఒక్కోసారి అవి హద్దులు దాటి పెద్ద వివాదాలకు దారితీస్తుంటాయి. ప్రస్తుతం శ్రీలంక వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్‌లో భారత యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆట కంటే ఎక్కువగా తన ప్రవర్తనతో నెగటివ్ వార్తల్లో నిలిచాడు. ఇండియా-ఎ తరఫున ఆడుతున్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రత్యర్థి జట్టు ఆటగాడితో గొడవకు దిగడం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మైదానంలో తోపులాట.. ఏం జరిగిందంటే?

శ్రీలంక-ఎ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఇండియా-ఎ టీమ్ సూపర్ ఓవర్‎లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ విజయానంతరం శ్రీలంక ఆటగాళ్లు ఆనందంతో జోష్ లో ఉంటూ భారత ఆటగాళ్లను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తీవ్ర నిరాశలో ఉన్న వైభవ్ సూర్యవంశీ సహనం కోల్పోయి, లంక ఆటగాడి దగ్గరకు వెళ్లి అతడిని గట్టిగా పక్కకు తోసేశాడు. దీనికి ప్రతిగా సదరు లంక ఆటగాడు కూడా వైభవ్‌ను వెనక్కి నెట్టడంతో మైదానంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. వెంటనే మిగిలిన ఆటగాళ్లు, అంపైర్లు జోక్యం చేసుకుని ఇరువరిని విడదీశారు. ఐసీసీ నిబంధనల ప్రకారం మైదానంలో ప్రత్యర్థి ప్లేయర్లను భౌతికంగా నెట్టడం తీవ్రమైన నేరం కాబట్టి, వైభవ్‌పై నిషేధం పడే అవకాశం ఉంది.

భారత కుర్రాడిపై లంక మాజీ మేనేజర్ నోటిదూల

ఈ ఘటనపై శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ మేనేజర్ బ్రయాన్ థామస్ సోషల్ మీడియా వేదికగా అత్యంత దారుణమైన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ ప్రవర్తనను తప్పుబడుతూ.. “నేను ఇప్పుడే సూర్యవంశీ అహంకారాన్ని వీడియోలో చూశాను. క్రికెట్‌లో రెడ్ లేదా ఎల్లో కార్డ్ లేకపోవడం విచారకరం. మ్యాచ్ రెఫరీ ఈ కౌబాయ్ (గొర్రెల కాపరి)ని తదుపరి మ్యాచ్ ల నుంచి సస్పెండ్ చేస్తేనే బుద్ధి వస్తుంది” అని రాసుకొచ్చాడు. అయితే ఆ తర్వాత అతడు చేసిన వ్యాఖ్యలు భారతీయులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి.

పెంపకం, చదువుపై లంక మేనేజర్ వివాదాస్పద కామెంట్స్

బ్రయాన్ థామస్ తన పోస్ట్‌లో భారతీయులను అవమానిస్తూ.. “భారతదేశంలోని ఒక పల్లెటూరు కుర్రాడి నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం? శ్రీలంకతో పోలిస్తే అక్కడ పెంపకంలో చదువు, సంస్కారాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. సూర్యవంశీ.. ఒకవేళ నీకు ఇక్కడ ఆడటం నచ్చకపోతే, నీ భారతీయ యజమానులకు ఫోన్ చేసి హాయిగా ఇంటికి వెళ్ళిపో. ఎందుకంటే క్రికెట్ అనేది జెంటిల్‌మెన్ గేమ్” అంటూ అత్యంత ఘాటుగా స్పందించాడు. ఒక యువ ఆటగాడి తప్పును ఎత్తిచూపడానికి, ఏకంగా భారతదేశపు పల్లెటూరి సంస్కృతిని, పెంపకాన్ని విమర్శించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు లంక మేనేజర్ పై విరుచుకుపడుతున్నారు.

బ్యాట్ తో రాణించలేకపోతున్న వైభవ్ సూర్యవంశీ

ఒకవైపు ఇలాంటి వివాదాలు నడుస్తుండగా, మరోవైపు ఈ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ఫామ్ కూడా చాలా పేలవంగా ఉంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ అతడు కనీసం ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. మొదటి మ్యాచ్‌లో శ్రీలంకపై కేవలం 14 పరుగులు మాత్రమే చేసిన వైభవ్.. అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 44 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించినప్పటికీ హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఇక తాజా మ్యాచ్‌లో లంకపై 21 పరుగులకే వెనుదిరిగాడు. మంచి ఆరంభాలు లభిస్తున్నప్పటికీ వాటిని పెద్ద స్కోర్లుగా మార్చడంలో విఫలమవుతున్న వైభవ్.. ఇప్పుడు ఈ కొత్త వివాదంతో కెరీర్ లో పెద్ద సవాలును ఎదుర్కొంటున్నాడు.

Follow Us